కారేపల్లి : గ్యాస్ ధరలు పెరిగి అవస్ధలు పడుతున్న వినియోగదారులపై గ్యాస్ ఏజన్సీలు మరింత భారం మోపుతున్నాయి. సిలిండర్పై గ్యాస్ ఏజన్సీలు అక్రమంగా అదనపు వసూళ్లకు పాల్పడుతుండటంపై కారేపల్లి మండలం వెంకిట్యాతండా గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేశారు. సదరు గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన వాహనాన్ని సోమవారం గ్రామస్థులు అడ్డుకున్నారు.
వెంకిట్యాతండా గ్రామస్థులు తెలిపి వివరాలు ఇలా ఉన్నాయి. ఆన్ లైన్లో గ్యాస్ బుక్ చేసుకుంటే రూ.965, దానికి డెలివరీ చార్జీలు రూ.20 మొత్తం రూ. 985లకు గ్యాస్ సిలిండర్ డెలివరీ కావాలి. కానీ, కారేపల్లి మండలంలో వాహనాలలో గ్యాస్ డెలివరీ చేస్తున్న వ్యక్తులు మాత్రం రూ. 1100 డిమాండ్ చేస్తున్నారని వినియోగదారులు తెలిపారు.
గ్యాస్ బుకింగ్ చేయని వారి నుండి అదనంగా మరో రూ.100 తీసుకుంటూ దోచుకుంటున్నారని వారు అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్యాస్ బండను అధిక ధరకు అమ్మడాన్ని నిరసిస్తూ గ్యాస్ బండలతో వచ్చిన వాహనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్యాస్ ఏజన్సీ సిబ్బంది అధిక ధరలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్న విషయాన్ని తహసీల్దార్, ఆర్ఐ, జీపీవోల దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్థులు. దాంతో, అధికారులు సదరు గ్యాస్ వాహనాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు.