వరంగల్,డిసెంబర్ 16 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ క్పారేషన్ పరిధిలో మరో 7 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు వెంటనే తయారు చేయాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఆమె అధికారులతో స్మార్ట్సిటీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గ్రేటర్లోని పోచమ్మమైదాన్, కాశీబుగ్గ, వెంకట్రామ సెంటర్, ఎస్ఎన్ఎం క్లబ్, హెడ్పోస్టాఫీస్, వరంగల్ చౌరస్తా, న్యూ శాయంపేట సెంటర్లను జంక్షన్లుగా అభివృద్ధి చేసేందుకు అంచనాలు చేయాలని అన్నారు. ట్రాఫిక్ ఐలాండ్, పాదచారులకు ఫుట్పాత్, లైటింగ్, డివైడర్ల సుందరీకరణ చేపట్టాలని పేర్కొన్నారు. శాస్త్రీయంగా జంక్షన్ల అభివృద్ధి జరుగాలని సూచించారు. రోడ్లు 1,2,3,4, ఎస్టీపీలు, భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు త్వరగా చేపట్టాలన్నారు. గవిచర్ల, దసరా రోడ్డు పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు. స్మార్ట్సిటీ ప్యాకేజీ-1 కింద చేపట్టిన 9 రహదారులు డ్రైనేజీ, ఫుట్పాత్, లైట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంజినీర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, సిటీ ప్లానర్ వెంకన్న, స్మార్ట్సిటీ పీఎంవో ఆనంద్ వోలేటి, డీసీపీ ప్రకాష్రెడ్డి, ఏసీపీ బషీర్ పాల్గొన్నారు.
భవన నిర్మాణాల పరిశీలన
నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్ ప్రావీణ్య అన్నారు. వివేకానంద కాలనీ, ఎన్జీవోస్ కాలనీల్లో చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనంతరం బాలసముద్రంలో నిర్మిస్తున్న వర్మీ కంపోస్ట్ ప్లాంట్ను పరిశీలించారు. ఆమె వెంట సిటీ ప్లానర్ వెంకన్న, డీఈ సంతోష్బాబు, ఏఈ అరవింద తదితరులు ఉన్నారు.