కాచిగూడ, జూలై 2 : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాల్సిందేనని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలనే డిమాండ్తో బీసీ జేఏసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కాజేజీల బంద్లో భాగంగా బర్కత్పుర చౌరస్తాలో విద్యార్థులతో కలిసి చేపట్టిన ధర్నాకు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్తో కలిసి మధుసూదనాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర విద్యార్థులదేనని, వారితో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టలేదని పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి పాలనలో రా ష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, సీఎం అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫ్యూచర్ ఉన్న వి ద్యార్థులను పక్కనబెట్టి, ఫ్యూచర్ లేని సిటీ కోసం రేవంత్ ఎందుకు పాకులాడుతున్నారని ప్రశ్నించారు. అనంతరం జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పక్క రాష్ర్టాన్ని చూసి రేవంత్రెడ్డి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ కాంట్రాక్టర్ల ప్రభుత్వమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు ఉండడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని, ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేసి ఫీజు నియంత్రణ చ ట్టాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు.