ఖానాపురం, నవంబర్ 25 : పాకాల ఆయకట్టు రైతులు పంటల సాగులో స్టేట్ షెడ్యూల్ను అనుసరించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక సొసైటీ ఆధ్వర్యంలో ఖానాపురం, మనుబోతులగడ్డ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా పాకాల ఆయకట్టు తైబందీని నవంబర్లోనే ప్రకటించామన్నారు. ఈ ప్రాంత రైతులు స్టేట్ షెడ్యూల్కు 40 రోజులు ఆలస్యంగా పంటలను సాగు చేస్తున్నారని, అందుకే ఈ సారి ముందస్తుగా తైబందీని ఖరారు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 15 నుంచి నీటిని విడుదల చేసి ఏప్రిల్ 10 వరకు ముగిస్తామన్నారు. యాసింగిలో 85 శాతం సాగుకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
రైతులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో వ్యవహరించుకుంటే వందశాతం తైబందీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాకాల పంట కాల్వల మరమ్మతులకు నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. రైతులు సహకరిస్తే కాల్వల ఆధునీకరణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు వ్యవసాయాధికారుల సూచనల మేరకు డ్రమ్సీడర్, వెదజల్లే విధానంలో పంటలను సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్రావు, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, డైరెక్టర్లు ఆబోత్ అశోక్, సునీత, లక్ష్మణ్, రమేశ్, తిరుపతి, కుమరస్వామి, సర్పంచ్లు బూస రమ, వల్లెపు సోమయ్య, గొర్రె కవిత రవి తదితరులు పాల్గొన్నారు.
ఇకపై పోడు చేస్తే చర్యలు..
గిరిజనేతరులకు హక్కుపత్రాలు కల్పించడం సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధరావుపేట, మనుబోతులగడ్డలో జరిగిన ఆర్వోఎఫ్ఆర్ గ్రామ సభల్లో ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు పట్టాలివ్వడం వారి హక్కులో భాగమేనని, అగ్రవర్ణ పేదలు, వెనుకబడిన తరగతులకు హక్కుపత్రాలు ఇవ్వడం దేశంలోనే తెలంగాణలో తప్ప మరెక్కడా లేదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును హత్య చేయడం బాధాకరమన్నారు. నియోజకవర్గంలో 7450 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వివిధ కారణాలతో 820 మంది దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు గుర్తించామని, వీరందరికీ మరో అవకాశం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. డిసెంబర్లో పోడు రైతులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని, ఇకపై పోడు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీడీవో జహీరొద్దీన్, ఎంపీడీవో సుమనావాణి, సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్, ఎఫ్ఆర్సీ చైర్మన్ బాలు తదితరులు పాల్గొన్నారు.
రూ.10 వేల ఆర్థిక సాయం..
మండలంలోని ఐనపల్లికి చెందిన బానోత్ తేజ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఎమ్మెల్యే పెద్ది అతడిని పరామర్శించారు. రూ.10వేలు ఆర్థికసాయం అందించారు. ఆయన వెంట బొప్పిడి పూర్ణచందర్రావు, రెడ్డి నాగార్జునరెడ్డి, మల్యాల పోశెట్టి, ఎంపీటీసీ మర్రి భారతి, రామస్వామి, బోడ భారతి, పూలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్తోనే విద్యార్థులకు మేలు..
నర్సంపేట : సీఎం కేసీఆర్తోనే విద్యార్థులకు మేలు కలుగుతుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రెషెర్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నారన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని కోరారు. నర్సంపేట డివిజన్ కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉద్యోగాలను సంపాదించేలా ప్రత్యేక శిక్షణను ఇస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంత విద్యార్థులకు కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నామని, విద్యార్థులు ఇందులో చేరి భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని కోరారు. కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, ప్రిన్సిపాల్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.