వరంగల్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర అభివృద్ధిపై వివక్ష చూపుతున్న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లా అంతటా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై మోదీ ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం తాత్సార వైఖరిపైనా నిరసన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామగుండం పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై స్పష్టత ఇవ్వాలని టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఇతర ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర అభివృద్ధిపై, రాష్ర్టానికి న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, నిధులపై స్పష్టత కోరినందుకు నిర్బంధించడంపై వామపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు.
హనుమకొండలోని కాళోజీ సెంటర్లో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్లో రైల్వే కోచ్ఫ్యాక్టరీ దశాబ్దాల డిమాండ్ అని బయ్యారం ఉకు పరిశ్రమకు ఇప్పటికీ మోక్షం రాలేదని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని భిక్షపతి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ, కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. విద్య, వైద్యరంగాలను ప్రైవేటుపరం చేస్తూ నిరుద్యోగులను నడిరోడ్డున పడేస్తున్న మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీకి ఇప్పుడు తెలంగాణలోని సింగరేణిపై కన్నుపడిందని, దీన్ని ప్రైవేట్పరం చేసే దురుద్దేశంతోనే రాష్ర్టానికి వస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ రాకను నిరసిస్తున్న సీపీఐ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని, వీరిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దెల ఎల్లేశ్ మంద సదలక్ష్మి, మోతె లింగారెడ్డి. ఎన్.రాజమౌళి, మునగాల భిక్షపతి, కొట్టపాక రవి పూర్ణచందర్, రాసమల్ల దీన, కోరపల్లి జ్యోతి పాల్గొన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా ప్రధాని మోదీకి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విమర్శించింది. మోదీ పర్యటన క్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టును సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మిశ్రీన్ సుల్తానా తీవ్రంగా ఖండించారు. వరంగల్ పోచమ్మమైదాన్ జంక్షన్లో సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సెంటర్లో మానవహారం నిర్వహించి మోదీ గోబ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు హామీ ఏమైందంటూ మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో బొగ్గు గని కార్మికులు నిరసనలతో హోరెత్తించారు.
అక్రమ అరెస్టులను ఖండించండి
మోదీ పర్యటన నేపథ్యంలో సీపీఎం, ఇతర ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలి. శుక్రవారం రాత్రి నాయకుల ఇండ్లపై దాడులు చేసి హసనపర్తి, హనుమకొండ, కాజీపేట, సుబేదారి, శాయంపేట, పరకాల, వేలేరు పోలీస్స్టేషన్లలో నిర్బంధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయలేదు. రాష్ర్టానికి ఐఐటీ, ఐఐఎం ఏర్పాటు హామీలను నెరవేర్చలేదు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, ధరల పెరుగుదల, ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలకు మంగళం పాడుతున్నారు.
– సీపీఎం హనుమకొండ జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి