మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు చేయడంపై బీసీల నిరసనలు మిన్నంటా యి. వరంగల్ చౌరస్తాలో గురువారం రాత్రి మున్నూరు కాపు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న బండి సంజయ్ను రాజకీయంగా బొంద పెడుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇళ్లపై చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు.
గిర్మాజీపేట, నవంబర్ 10: బీసీ నాయకులపై కేంద్రం చేస్తున్న ఈడీ, ఐటీ దాడులపై గురువారం రాత్రి వరంగల్ చౌరస్తాలో మున్నూరు కాపుసంఘం సభ్యుల ఆధ్వర్యంలో పీఎం నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మున్నూరుకాపు సంఘం డివిజన్ అధ్యక్షుడు దోనం ఆనంద్ మాట్లాడుతూ మున్నూరుకాపు బిడ్డలైన మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇండ్లలో ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపు సంక్షేమాని కి సీఎం కేసీఆర్ ప్రాధాన్యతను ఇస్తూ మన అభివృద్ధికి అండగా ఉంటున్నారని, ఇది చూసి ఓర్వలేనితనంతో ఐటీ దాడులు జరుపడం హేయమైన చర్య అన్నారు. వారికి సంఘం సభ్యులు అండగా ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గందె కల్పనానవీన్, ముష్కమల్ల అరుణాసుధాకర్, మున్నూరుకాపు నేతలు గుమ్మడి దాసు, మిరిపల్లి వినయ్కుమార్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.