ఖిలావరంగల్, అక్టోబర్ 31 : ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత, అధికార యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘స్వచ్ఛ భారత్-క్లీన్ ఇండియా మెగా డ్రైవ్’ ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల పాటు జరిగిన స్వచ్ఛ భారత్ మెగా డ్రైవ్లో 20 వేల కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను సేకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి అభినందలు చెప్పారు. ఏడాదంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. క్లీన్ ఇండియా డ్రైవ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను బహుమతులు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీ హరిసింగ్, కే శ్రీవత్స, జిల్లా యువజన అధికారి సీహెచ్ అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్కు 35 దరఖాస్తులు..
కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్కు 35 మంది తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ బీ గోపికి దరఖాస్తులు అందజేశారు. భూ సంబంధిత సమస్యలపై 14, విద్య, ఎంజీఎం, డీపీవో, ఎస్సీ కార్పొరేషన్, గురుకులాలు, మార్కెటింగ్, డీఆర్డీవో, జిల్లా కో ఆపరేటివ్, డబుల్ బెడ్ రూం, ల్యాండ్ సీలింగ్, జీడబ్ల్యూఎంసీ సమస్యలతో పాటు లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించాలని వినతులు వచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. అధికారులందరూ అర్జిదారుల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.