వరంగల్, అక్టోబర్ 22(నమస్తేతెలంగాణ) : ఆయిల్పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. యాసంగి సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో రైతులను ఆయిల్పామ్ సాగు దిశగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం వానలు కురవడం తగ్గినందున సాగుకు ఇది అనుకూల వాతావరణమని రైతులకు అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు క్లస్టర్ స్థాయిలో సదస్సులు నిర్వహించేందుకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సంయుక్తంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైదరాబాద్లో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆయిల్పామ్ సాగుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2022-23లో రాష్ట్రంలో 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. సాగుకు అనువుగా ఉన్న 26 జిల్లాల్లో పదకొండు కంపెనీలకు లైసెన్సు ఇచ్చినట్లు చెప్పారు.
ఈ కంపెనీలు తమ నర్సరీల్లో మొక్కలను పెంచి రైతులకు సరఫరా చేస్తున్నట్లు కూడా తెలిపారు. మరో కొద్ది రోజుల్లో యాసంగి సీజన్ ప్రారంభం కానున్నందున ఆయిల్పామ్ సాగుపై రైతులను ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయిల్పామ్ సాగులో ఉద్యానశాఖతో పాటు వ్యవసాయశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలన్నారు. దీంతో ఇకనుంచి ఆయిల్పామ్ సాగు చేసే రైతులు క్లస్టర్లలోని వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈవో)లను కూడా సంప్రదించనున్నారు. ఇప్పటి వరకు ఆయిల్పామ్ మొక్కలు, డ్రిప్ మంజూరు కోసం ఉద్యానశాఖ అధికారులను మాత్రమే సంప్రదించారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏఈవోలూ ఆయిల్పామ్ మొక్కలు, డ్రిప్, సబ్సిడీకి సంబంధించి ధ్రువీకరించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ఉద్యాన, వ్యవసాయశాఖల అధికారులు ఆయిల్పామ్ సాగు కోసం రైతులను ప్రోత్సహించేందుకు రంగంలోకి దిగారు. శనివారం ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఉషాదయాళ్ ఈ రెండు శాఖల అధికారులతో సమావేశమై ఆయిల్పామ్ సాగుకు ప్లాన్ చేశారు. క్లస్టర్ స్థాయిలో రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొనాలని నిర్ణయించారు.
లక్ష్యం 58 వేల ఎకరాలు..
నాలుగేళ్లలో జిల్లాలో 58 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9,231 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు అధికారులు ప్రణాళిక తయారు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందిన రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ సంగెం మండలం రామచంద్రాపురం గ్రామ శివారులోని 70 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటు చేసి ఆయిల్పామ్ మొక్కల పెంపకం చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని రైతులు సుమారు పదమూడు వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ఉద్యాన శాఖ అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆగస్టు నెల నుంచి జిల్లాలో ఆయిల్పామ్ మొక్కల పంపిణీ మొదలైందని, ఇప్పటివరకు 1,500 ఎకరాల్లో రైతులు నాటారని ఉద్యాన, వ్యవసాయ శాఖల జిల్లా అధికారులు శ్రీనివాసరావు, ఉషాదయాళ్ శనివారం వెల్లడించారు. దరఖాస్తుదారుల్లో ఎక్కువమంది వానకాలం పత్తి, వరి, మక్కజొన్న తదితర పంటలను సాగు చేశారని, మరికొద్ది రోజుల్లో వానకాలం ముగిసిపోనున్నందున యాసంగిలో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని కోరారు. యాసంగి సీజన్లో ఆయిల్పామ్ సాగు చేసే రైతులు వరి మినహా అన్ని రకాల పంటలను అంతర పంటలుగా సాగు చేయవచ్చన్నారు. ఏఈవోలు, ఉద్యాన అధికారులు, ఆయిల్పామ్ కంపెనీ ప్రతినిధులను కలిసి కావాల్సిన ఆయిల్పామ్ మొక్కలను పొంది నాటాలని రైతులను కోరారు. ప్రభుత్వం ఒక్కో మొక్కకు రాయితీ ఇస్తున్నదని, రైతులు తమ వాటాగా రూ.20 చెల్లించాల్సి ఉందని తెలిపారు. బిందు సేద్యం కోసం ప్రభుత్వం 80 నుంచి 100 శాతం వరకు నిబంధనల ప్రకారం సబ్సిడీ ఇస్తుందని ప్రకటించారు. ఈ ఏడాది నిర్దేశిత 9,231 ఎకరాలకు గాను ఆరు వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని, ఈ మేరకు కంపెనీ నర్సరీలో ఆయిల్పామ్ మొక్కలను సిద్ధం చేసి రైతులకు అందజేయడం ప్రారంభించినట్లు తెలిపారు.