వెంకటాపూర్, అక్టోబర్ 22 : మండలంలోని రామప్ప దేవాలయాన్ని శనివారం అమెరికా దేశానికి చెందిన మార్త జపాట, కెరిలిన్ వేర్వేరుగా సందర్శించారు. ఆలయ విశిష్టతను స్టేట్ టూరిజం గైడ్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకొన్నారు. రామప్ప ఆర్కిటెక్చర్ బ్యూటీఫుల్ అని, నాటి ఇంజినీరింగ్ టెక్నాలజీ గ్రేట్ అన్నారు. 2017లో తెలంగాణకు వచ్చినప్పటికీ రామప్ప ఆలయం గురించి తెలియక సందర్శించలేదని, యునెస్కో గుర్తింపుతో చూసేందుకు వచ్చానని మార్త జపాట తెలిపారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించారు.
25న రామప్ప ఆలయం మూసివేత
రామప్ప దేవాలయం ఈనెల 25న సూర్యగ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం నిత్యారాధనతో పాటు మహానివేదన నిర్వహించి 9 గంటల నుంచి ద్వార బంధనం చేయనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి 26వ తేదీన మహాసంప్రోక్షణ చేసి స్వామి వారికి అభిషేకం, అలంకరణ, నివేదన, హారతి నిర్వహణ తర్వాత దర్శనం, ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని వివరించారు.