వరంగల్, అక్టోబర్ 19 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక నగరంలో మరో కొత్త నిర్మాణం మొదలుకానున్నది. రూ. 75 కోట్లతో ఆధునిక హంగులతో ఆర్టీసీ బస్స్టేషన్ను నిర్మించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రస్తుతం వరంగల్లోని బస్ స్టేషన్ ఆవరణతో పాటు చుట్టు పక్కల స్థలాలను కలిపి రెండున్నర ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. త్వరలోనే పనులను మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఎస్ఆర్టీసీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉమ్మడిగా ఈ పనులను పూర్తి చేయనున్నాయి. వేగంగా విస్తరిస్తున్న వరంగల్ నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రవాణా వసతులను పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్ట్ స్టేషన్ ఆవరణలోనే కొత్త బస్టాండ్ను నిర్మించడం వల్ల ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉం టుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం స్మార్ట్ బస్ స్టేషన్ను నిర్మించనున్నారు. డిస్ట్రిక్, లోకల్ బస్ స్టేషన్తో ఇరుకుగా ఉన్న ప్రస్తుత బస్ స్టేషన్ను విశాలంగా మార్చనున్నారు. ప్రస్తుత బస్ స్టేషన్, మార్కెట్కు వెళ్లే రోడ్డు, మున్సిపల్ కాంప్లెక్స్ స్థలాలను కలిపి విశాలంగా నిర్మా ణం చేపట్టనున్నారు. వరంగల్ బస్స్టేషన్ పక్క నుంచి కూరగాయల మార్కెట్ మీదు గా కాశీబుగ్గ ప్రధాన రహదారిని కలుపుతూ కొత్తరోడ్డును నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
రైల్వే అధికారులతో టీఎస్ఆర్టీసీ అధికారులు దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. వరంగల్ రైల్వే స్టేషన్, కొత్తగా నిర్మించే బస్స్టేషన్కు మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. రూ.75 కోట్ల అంచనాతో 2 ఎకరాల 32 గుంటల విస్తీర్ణంలో బస్ స్టేషన్ నిర్మాణం జరుగనుంది. జీ ప్లస్ 5 ఫ్లోర్లతో నిర్మించే కొత్త బస్ స్టేషన్లో 32 ప్లాట్ఫారాలు ఉంటా యి. కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మా ల్స్, హోటల్స్, ఇతర వసతులను కల్పించనున్నారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ తరహాలో ఆధునిక హంగులను సమకూర్చనున్నారు. వరంగల్లో కొత్తగా నిర్మించే స్మార్ట్ బస్స్టేషన్ ప్రతిపాదనలపై మూడు రోజుల క్రితం టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన హైదరాబాద్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్ పాల్గొన్నారు. స్మార్ట్ బస్ స్టేషన్పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కే తారకరామారావు ఆదేశాల మేరకు కొత్త బస్టాండు నిర్మాణంపై కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో ఆమోదించారు. నూతన హంగులతో వరంగల్లో కొత్త బస్స్టేషన్ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు.
నియో మెట్రోతో లింక్..
గ్రేటర్ వరంగల్లోని ప్రజా రవాణా వ్యవస్థను సరికొత్తగా మార్చే ప్రణాళికలో భాగంగా స్మార్ట్ బస్స్టేషన్ను నిర్మించడంతో పాటు వరంగల్ నుంచి కాజీపేట వరకు వేగంగా, భద్రత ఉండేలా రవాణా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు నిర్మించనున్న నియో మెట్రోకు కొత్తగా నిర్మించే స్మార్ట్ బస్స్టేషన్ను అనుసంధానం చేయనున్నారు. దీనిపై నాగ్పూర్లో నియోమెట్రోను నిర్మించే సంస్థతోనూ చర్చలు జరిపారు. స్కై వేలను నిర్మించి నియోమెట్రోకు కలుపనున్నారు. కుడా ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్లో నియోమెట్రో నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2050 సంవత్సరానికి గ్రేటర్ వరంగల్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోమెట్రో, స్మార్ట్ బస్స్టేషన్ను నిర్మించనున్నారు. వరంగల్ నుంచి కాజీపేట వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ప్రజా రవాణాకు అవసరమైన వసతులను కల్పించనున్నారు.