వర్ధన్నపేట, అక్టోబర్ 19: వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన నిధులు దుర్వినియోగం అయ్యాయనే అరోపణల్లో వాస్తవం లేదని మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించారన్నారు. ఆ నిధులతో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ, కొంతమంది పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక నిధులను దుర్వినియోగం చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేస్తూ పనులు చేయిస్తున్నామని స్పష్టం చేశారు. మున్సిపల్ అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చుపై ఎలాంటి విచారణకైనా పాలక మండలి సిద్ధంగా ఉందని ఆమె సవాల్ విసిరారు. నిధుల విషయంలో విపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లను తీసుకొని కార్యాలయానికి వెళితే కొన్ని పత్రికల ప్రతినిధులు తప్పుడు కథనాలు రాశారని ఆమె ఆరోపించారు. పట్టణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న పాలక మండలి, ఇందుకు సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్కు పట్టణ ప్రజలు సహకారం అందించాలని కోరారు.
నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే ఆరోపణలు చేయాలని హితవు పలికారు. లేకుంటే రానున్న రోజుల్లో తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి పట్టణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు తోటకూరి రాజమణి, తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, పట్టణ ప్రముఖులు పులి శ్రీనివాస్, మైస రాము, శ్రీనివాస్, వీరన్న పాల్గొన్నారు.