వరంగల్, అక్టోబరు 11(నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. పేద విద్యార్థుల కోసం ఇన్నాళ్లు పనిచేస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలకు తోడు ఏటా కొత్తగా మరికొన్నింటిని నెలకొల్పుతున్నది. దీంతో ఆర్థికంగా లేని కుటుంబాల విద్యార్థులు గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా వసతితో పాటు నాణ్యమైన చదువును పొందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బీసీ విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరం మరికొన్ని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాకు నూతనంగా రెండు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయి. వీటిని సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆరు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. వరంగల్తో పాటు సంగెం, నెక్కొండ తదితర ప్రాంతాల్లో ఇవి పనిచేస్తున్నాయి. ప్రతి బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం మంచి వసతితో పాటు నాణ్యమైన విద్య అందిస్తుండడంతో ఆశించిన ఫలితాలొస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా కొత్తగా కొన్ని గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో వివిధ రూపాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు చిన్నారుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాకు కొత్తగా మంజూరైన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, వీటిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాల్లో ప్రారంభించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తుండడంతో మరిసిపోతున్నారు.
కొత్త రెసిడెన్షియల్స్ ఎక్కడంటే..
ఈ ఏడాది కొత్తగా జిల్లాకు మంజూరైన రెండు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒకటి బాలురది, రెండోది బాలికలది. వీటిలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను నర్సంపేట, బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను రాయపర్తి మండలంలోని సన్నూరు క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది వీటిలో ఐదు, ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు వసతి కల్పించి విద్య అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రతి తరగతిలో రెండేసి సెక్షన్లు నిర్వహించాలని, ఒక్కో సెక్షన్లో నలభై మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని పేర్కొంది. దీంతో ఒక్కో పాఠశాలలో ఈ ఏడాది మూడు తరగతుల్లో 240 మంది విద్యార్థుల చొప్పున ఉచిత వసతి, చదువును పొందే అవకాశం కలిగింది. ఈ లెక్కన జిల్లాలో కొత్తగా 480 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది. ప్రస్తుతం పనిచేస్తున్న బీసీ రెసిడెన్షియల్స్ పాఠశాలల కోసం ఇటీవల నిర్వహించిన ఎంట్రెన్స్కు హాజరైన విద్యార్థుల్లో నుంచి అధికారులు మెరిట్ ప్రకారం రెండు కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు విద్యార్థులను సెలెక్ట్ చేశారు. ఈ ఏడాది వీటిలో ఏడో తరగతిలో చేరే విద్యార్థులకు వచ్చే ఏడాది ఎనిమిది తరగతి చదువుకునే చాన్స్ లభించనుంది. ఇలా రానున్న మూడేళ్లలో ఈ నూతన రెసిడెన్షియల్స్లో తరగతులు ఐదు నుంచి పదికి పెరుగనున్నాయి.
14వ తేదీ నుంచి తరగతులు..
కొత్త బీసీ రెసిడెన్షియల్స్ పాఠశాలల్లో ఈ నెల 14 నుంచి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో అధికారులు స్కూళ్ల నిర్వహణకు భవనాలను వెతికే పనుల్లో తలమునకలయ్యారు. సన్నూరు క్రాస్ రోడ్డు వద్ద ఓ అద్దె భవనంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. సన్నూరు క్రాస్ రోడ్డు వద్ద దీన్ని ఈ నెల 15న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభిస్తారని బీసీ రెసిడెన్షియల్స్ రీజినల్ కో ఆర్డినేటర్ రాంరెడ్డి వెల్లడించారు.