పాలకుర్తి రూరల్, అక్టోబర్ 11: హరిహరులకు నిలయం శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం. శివుడు విష్ణువు ఒకే ఆలయంలో ప్రతిష్ట కావడం ఇక్కడి ప్రత్యేకత. జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చొరవతో అభివృద్ధికి నోచుకుంది. మంత్రి కృషితో ఇప్పటికే ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు రూ.70లక్షలతో పూర్తయింది. ఆలయ ప్రధాన ద్వారం రోడ్డు పూర్తయి సెంట్రల్ లైటింగ్ను రూ.50లక్షలతో ఏర్పాటు చేశారు. ఆలయ పై భాగాన ఉన్న గోపురం, సాలహారం రూపురేఖలు మారాయి. విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఆలయం వెలిగిపోతోంది.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుట్ట చుట్టూ సీసీ రోడ్డు వేశారు. రూ.5కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, ఆర్అండ్బీ ఈఈ అల్లమనేని నాగేందర్రావు, డీఈ జీవన్కుమార్ల పర్యవేక్షణలో చురుగ్గా సాగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం కొత్తగా మెట్లు నిర్మించారు. మెట్ల చుట్టూ గార్డెనింగ్ ఏర్పాటుచేసి పూల మొక్కలు నాటుతున్నారు. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అలాగే ఆలయంలో ఉద్యోగుల సంఖ్య పెరిగి కొత్తకళ వచ్చింది.
యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతా..
శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతా. ఇప్పటికే ఆలయ అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల నిధులు కేటాయించాం. గుట్ట చుట్టూ బండ్లు తిరగడానికి, భక్తుల కోసం సీసీ రోడ్డు వేయించాం. ప్రధాన ద్వారం రోడ్డు సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులు చేయించాం. ప్రస్తుతం గుట్టపైకి భక్తులు మెట్ల ద్వారా చేరుకునేందుకు నూతనంగా నిర్మిస్తున్నాం. గుట్టపైన సాలహారం, గోపురం పనులు పూర్తి కావస్తున్నాయి. పాలకుర్తిని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతా. సన్నూరులో ఆలయ పనులు చురుగ్గా నడుస్తున్నాయి.
– ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి
మంత్రి ఎర్రబెల్లి సహకారంతోనే..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతోనే సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అభివృద్ధి చెందింది. గతంలో ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ సీసీ రోడ్డు పనులను పూర్తి చేశాం. ఆలయ ప్రధాన ద్వారం సీసీ రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేశాం. ప్రస్తుతం గుడి చుట్టూ సాలహారం, గోపురం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా మెట్లు కొత్తగా నిర్మించాం. అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి.
– కొత్తపల్లి వెంకటయ్య,ఆలయ సూపరింటెండెంట్
కొత్త కళ వచ్చింది.
సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. సమైక్య పాలనలో ఆలయాలను అస్సలు పట్టించుకోలేదు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో కోట్లాది రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తుల రాక పెరిగి ఆలయం కళకళలాడుతోంది. వ్యాపారాలు బాగా పెరిగాయి.
– గంగు నవీన్శర్మ, భక్తుడు