విధి రాతనెవ్వరూ తప్పించలేరంటే ఇదేనేమో.. ఉద్యోగంలో చేరడానికి ఒక్క రోజు ముందే జరిగిన రోడ్డు ప్రమాదం ఆ యువకుడి ఆశలను చిదిమేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. నౌకరి చేసి వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడనుకుంటే ఉలుకూ పలుకు లేక జీవచ్చవంలా మంచానికే పరిమితవడవంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. కోమాలో ఉన్న కొడుక్కు 14 నెలలుగా సపర్యలు చేస్తూ కంటికోధారలా విలపిస్తున్నారు. ఉన్న ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించినా ఫలితం లేదని, దాతలు ఆదుకోవాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. – చిన్నగూడూరు, అక్టోబర్11
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం పగిడిపల్లి శివారు బాబోజితండాకు చెందిన ధరంసోత్ వెంకన్న, సుగుణమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి వీరేందర్, నరేశ్(23) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కష్టపడి ఇద్దరినీ హైదరాబాద్లో బీటెక్ వరకు చదివించారు. పెద్ద కొడుకు ఉద్యోగ అన్వేషణలో ఉండగా, చిన్న కొడుకు నరేశ్ పోస్టల్శాఖలో ఉద్యోగానికి అర్హత సాధించాడు. సీనియర్ అసిస్టెంట్గా నాగాలాండ్ రాష్ట్రంలో ఉద్యోగం వచ్చింది.
ఆనందంతో కాల్లెటర్ తీసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం 18 జూన్, 2021న హైదరాబాద్ నుంచి ద్విచక్రవాహనంపై చిన్నగూడూరులోని తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఇంతలోనే విధి వెక్కిరించింది. మోత్కూర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేశ్కు తీవ్రగాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు ఆధార్ కార్డు, సెల్ఫోన్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించారు. మూడు నెలలు చికిత్స అందించి, కోమాలో ఉన్న నరేశ్ను ఇంటికి పంపించారు. అప్పటి నుంచి అచేతన స్థితిలో ఉంటున్న నరేశ్కు పైపు ద్వారా ద్రవరూపంలో ఆహారం అందిస్తూ సేవలు చేస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటి వరకు రూ.35 లక్షలు ఖర్చు చేశామని, అయినా ఉలుకూ పలుకు లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉన్న రెండున్నర ఎకరాల భూమి, 4 గుంటల ఇంటి స్థలం, కాడెడ్లను సైతం అమ్మి వైద్యం కోసం ఖర్చు చేశామని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం గంటల్లోనే ఆవిరైపోయిందని ఆవేదన చెందుతున్నారు. ‘సీఎం సహాయనిధి నుంచి ఎమ్మెల్యే రెడ్యానాయక్ సార్ రూ.రెం డున్నర లక్షలు ఇప్పించారు. పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తే కొడు కు బాగుపడుతాడనే నమ్మకముంది.. దాతలు ఆదుకోవాలని’ చేతులెత్తి వేడుకుంటున్నారు. 9912864981 సెల్ నంబర్లో సంప్రదించాలని కోరారు.
నా కొడుక్కు పునర్జన్మ ప్రసాదించండి..
మాలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకూ రావొద్దు. ఉద్యో గం చేసి అండగా ఉంటాడనుకున్న కొడుక్కు మేమే సపర్య లు చేస్తున్నాం. వైద్యం కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నం. 14 నెలులుగా ఉలుకూ పలుకు లే దు. మూసిన కన్ను తెరువ డం లేదు. ద్రవరూపంలో ఆ హారం అందిస్తున్నాం. కొడుకు బాగుపడాలని రోజూ పూజలు చేస్తున్నాం. ఏ దేవుడైనా ఆదుకుంటాడనే నమ్మకం ఉంది. పెద్ద మనసుతో ఎవరైనా ముందుకొచ్చి నా కొడుక్కు పునర్జన్మ ప్రసాదించండి.
– ధరంసోత్ సుగుణమ్మ, నరేశ్ తల్లి