వరంగల్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పారిశుధ్య నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తున్నది. అత్యాధునిక సాంకేతికతను పారిశుధ్య నిర్వహణకు అనుసంధానం చేస్తున్నది. ఇందులో భాగంగానే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు ప్రాజెక్టులు ప్రయోగాత్మకంగా అమలవుతున్నాయి. తాజాగా రసాయనాలు వినియోగించకుండా మురుగునీటిని బయోఆర్గానిక్ పద్ధతిలో శుద్ధి చేయడం, మానవ వ్యర్థాల ఎరువులను వినియోగించి ఔషధ మొక్కలను పెంచే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ వరంగల్లో ప్రయోగాత్మకంగా చేపట్టింది. గత నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంక్ వాష్ ఇన్నోవేషన్లో పలు దేశాల పారిశుధ్య నిర్వహణ సంస్థలు పాల్గొన్నాయి. పారిశుధ్య నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే పలు ప్రాజెక్టులను గ్రేటర్ వరంగల్లో నిర్వహించేందుకు అంగీకరించాయి. దీంట్లో భాగంగా మానవ వ్యర్థాల ఎరువుల వినియోగం, బయో ఆర్గానిక్ పద్ధతిలో మురుగునీటి శుద్ధి ప్రక్రియను చేపట్టారు. మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే మొదటి సారి గ్రేటర్ వరంగల్లో నిర్మించారు. ఈ కేంద్రంలోని పోగయ్యే మానవ వ్యర్థాలతో ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారు.
ఇండ్లలోని మొక్కలకు వినియోగించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడంలేదు. ఆస్కీ సంస్థ ప్రస్తుతం ఈ ఎరువును ధరణి పేరుతో రైతులకు ఉచితంగా అందజేస్తున్నది. మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రం పూర్తి స్థాయిలో పని చేసేందుకు వీలుగా ఉత్పత్తి అయిన మొత్తం ఎరువును వినియోగించేలా గ్రేటర్ వరంగల్లో ఔషధ మొక్కలను పెంచే ప్రక్రియను చేపట్టారు. గ్రేటర్ వరంగల్లోనే తొలిసారిగా ఈ విధానం మొదలైంది. మానవ వ్యర్థాల కేంద్రంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను వినియోగించేందుకు ప్రత్యేకంగా ఔషధ మొక్కల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మాగ్నాట్రీ ప్రైవేట్ సంస్థ గ్రేటర్ పరిధిలోని అమ్మవారిపేటలో మానవ వ్యర్థాల కేంద్రం వద్ద మొక్కల పెంపకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 10 షెడ్లను నిర్మించింది. మావన వ్యర్థాలతో ఉత్పత్తి అయ్యే ఎరువులను, వ్యర్థాల శుద్ధి ప్రక్రియలో వచ్చే నీటిని ఈ మొక్కలకు వినియోగిస్తున్నారు.
మురుగునీరు లేకుండా…
మాగ్నాట్రీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రేటర్ వరంగల్ పరిధిలోని మైసయ్యనగర్ మురికివాడలో దీన్ని పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. కాలనీల్లోని మురుగునీరు, వర్షపునీరు, ఇళ్ల నుంచి వచ్చే నీరు ఒక చోట చేరి ఆ ప్రదేశం అంతా వాసన, అపరిశుభ్రతతో నిండిపోయే పరిస్థితులు ఉంటాయి. బయో ఆర్గానిక్ పద్ధతిలో ఇది మొత్తం మారుతున్నది. ఒక్క చోట చేరిన మురుగు, వర్షపునీటిని ఆర్గానిక్ పద్ధతిలో శుద్ధి చేస్తున్నారు. ఈ ప్రక్రియతో నీరు నిల్వ ఉన్నా అపరిశుభ్రత లేకుండా అవుతున్నది. బయో ఆర్గానికి పద్ధతితో మురికి గుంటల నుంచి వాసన రావడం ఆగిపోతున్నది. రసాయనాలతో చేపట్టే శుద్ధీకరణ కంటే బయో ఆర్గానిక్ ప్రక్రియ తక్కువ ఖర్చుతో పారిశుధ్య నిర్వహణ జరుగుతున్నది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ విధానాన్ని రెండోదశలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని 193 మురికివాడలు, ఇతర కాలనీల్లోని మురుగునీటి నిల్వల శుద్ధి ప్రక్రియకు అమలు చేయనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ విధానం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అమలు కానున్నది.