ఖానాపురం, అక్టోబర్ 8: పేద కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందజేస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. ఖానాపురం, ధర్మారావుపేటలో శనివారం ఆసరా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మండలకేంద్రంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పింఛన్ డబ్బులు అందించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. 57 ఏళ్లు నిండిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. పింఛన్ డబ్బులు అందడంతో పేదల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నదని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని కొనియాడారు. లబ్ధిదారులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడిద కుమార్, సొసైటీ డైరెక్టర్ వేములపల్లి సునీత పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు
నర్సంపేట రూరల్: అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తున్నదని గురిజాల సర్పంచ్ గొడిశాల మమత అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ డబ్బులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. పింఛన్ రాని వారు అధైర్య పడొద్దని, మరోసారి దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామంలో నూతనంగా 225 మందికి పింఛన్లు మంజూరయ్యాయని, గతంలో ఉన్న 700 కలిపి మొత్తం 925 మందికి ఆసరా పింఛన్లు అందించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ హరీశ్, కార్యదర్శి రాజమౌళి, గ్రామపెద్దలు గొడిశాల సదానందంగౌడ్, బండారి సదానందం, కుమ్మరికుంట్ల రాములు, జనగాం భాగ్య, ఆకుల నర్సింగం, మర్ద రవీందర్, ఎడ సాంబయ్య, పసుల కొమ్మాలు, బండారి సుదర్శన్ పాల్గొన్నారు.
కొత్త పింఛన్దారుల్లో ఆనందం..
నల్లబెల్లి: మండలంలో కొత్తగా పింఛన్లు పొందిన లబ్ధిదారుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సహకారంతో మండల పరిధిలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరయ్యాయి. ఈ మేరకు శనివారం వారు పింఛన్ డబ్బులు అందుకొని సంబురపడ్డారు. సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు అందించి తమ కుటుంబాలకు అండగా నిలిచారని, ఆయనకు రుణపడి ఉంటామని పలువురు లబ్ధిదారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వక్కల మల్లక్క, కార్యదర్శి మహ్మద్ రహీం, వక్కల చంద్రమౌళి, పీఏసీఎస్ డైరెక్టర్ చెన్నమల్ల నర్సయ్య, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు పాల్గొన్నారు.