నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 2: నేడు సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకొనేందుకు ఆడబిడ్డలంతా సిద్ధమయ్యారు. ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబురాలు, సోమవారం సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఆడబిడ్డలకు ఇదే పెద్ద పండుగ కావడంతో ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు, కొత్తగా పెళ్లయిన ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకున్నారు. నేడు మమతానురాగాల బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారు. ఏడాదికి సరిపడా ఆనందాన్ని మూటగట్టుకొని తిరిగి వెళ్తారు. తమకు మంచి భర్త దొరకాలంటూ పడుచులు బతుకమ్మను కొలుస్తారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
మార్కెట్లు కిటకిట..
సోమవారం సద్దుల బతుకమ్మ కావడంతో ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లన్నీ పూలవనాలను తలపించాయి. జిల్లా, పట్టణ కేంద్రాల్లోని మార్కె ట్లు, ప్రధాన కూడళ్లు పూలతో కళకళలాడాయి. ఈసారి పూల ధర ఆకాశాన్నంటింది. కిలో పూలకు రూ. 200 నుంచి 250 వరకు పలికింది. అంతేగాక మార్కెట్లో ఏ దుకాణం చూసినా అమ్మకందారులు, కొనుగోలుదారులతో సందడిగా కనిపించింది.
గ్రేటర్ పరిధిలో పూర్తి ..
వరంగల్: తెలంగాణ ఆడబిడ్డల పండుగ సద్దుల బతుకమ్మకు ఆట స్థలాలు ముస్తాబయ్యాయి. ఇందుకోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ. మూడు కోట్లతో విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలోని సుమారు 135 ప్రాంతాల్లో బతుకమ్మ ఆట స్థలాలు చదును చేసి, గుంతలు పూడ్చారు. హనుమకొండ ప్రాంతంలోని పద్మాక్ష్మి దేవాలయం, బంధం చెరువు, హసన్పర్తి పెద్ద చెరువు, రంగలీల మైదానం, ఖిలావరంగల్ కోట, రంగశాయిపేట, బెస్తం చెరువు, చిన్నవడ్డేపల్లి చెరువు, తోటమైదానం, గుండు చెరవు, మెట్టు దర్వాజ ప్రాంతాలతోపాటు విలీన గ్రామాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ గోపి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఇప్పటికే పలుమార్లు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను చేయాలని ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువుల్లోని గుర్రపు డెక్కలను తొలగించారు. పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దసరా సందర్భంగా ఉర్సు రంగలీల మైదానాన్ని రావణ వధకు మైదానం సిద్ధం చేశారు . రంగలీల మైదానం, పద్మాక్షి గుట్ట ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు