బయ్యారం, సెప్టెంబర్ 27 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లి సమీపంలోని పెద్దగుట్టతో పాటు రామచంద్రాపురం, మొట్లతిమ్మాపురం అటవీ ప్రాంతంలో 60 ప్లస్ శాతం కలిగిన ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే స్థానిక యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని నాటి ప్రభుత్వ పెద్దలు భావించి విభజన చట్టంలో పొందుపర్చారు. సెయిల్ ఆధ్వర్యంలో రూ.30వేల కోట్లతో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని చట్టంలో పేర్కొన్నారు. దీని ప్రకారం బయ్యారంలో స్టీల్ప్లాంట్ నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కాగా, ఉక్కు పరిశ్రమ విషయంలో ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. విభజన హామీని నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా అవి బుట్టదాఖలే అయ్యాయి. ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వకపోగా, కేంద్రంలోని పెద్దలు స్టీల్ప్లాంట్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం ఢిల్లీలో బతుకమ్మ వేడుకలకు సంబంధించి నిర్వహించిన ప్రెస్మీట్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరోమారు నోటికొచ్చినట్లు మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం సాధ్యం కాదంటూ తెలంగాణ ప్రజలను అవమానించారు. ఉక్కు పరిశ్రమ విషయంలో గత ఫిబ్రవరి నెలలో ఇదే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫిజుబులిటీ లేదని, పూర్తిస్థాయిలో అంచనా వేయకుండా విభజన చట్టంలో పొందుపర్చారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని ప్రైవేట్ సెక్టార్లో స్టీల్ తక్కువ ధరకు దొరుకుతున్నదని, అందువల్ల పరిశ్రమ నిర్మించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా పలువురు కేంద్ర మంత్రులు సైతం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన వనరులతోపాటు నాణ్యమైన ఖనిజం లేందటూ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడారు. వాస్తవంగా చూస్తే.., బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించేందుకు అవసరమైన నీరు, డోలమైట్, బొగ్గు, విద్యుత్ వంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. బయ్యారం అడవుల్లో నాణ్యత కలిగిన ఇనుప ఖనిజం లక్షల టన్నుల్లో ఉన్నది. గతంలో సర్వే నిర్వహించిన జీఎస్ఐ, సెయిల్, సింగరేణి వంటి సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బయ్యారంలో మొట్టమొదట 1954లోనే మైనింగ్ ప్రారంభమై 1969 వరకు కొనసాగింది. అప్పట్లోనే ఆక్కడి ఇనుప ఖనిజాన్ని రష్యా, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేశారు.
టీఆర్ఎస్ పోరాటం..
బయ్యారం ఇనుప ఖనిజాన్ని కాపాడుకునేందుకు ఆది నుంచి టీఆర్ఎస్ పోరాటాలు చేస్తున్నది. అనేక ఉద్యమాల ఫలితంగానే నాటి కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. దీని ప్రకారం పరిశ్రమ నిర్మిస్తే ఉద్యోగాలొస్తాయని స్థానిక యువత ఆశగా ఎనిమిదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నది. యువత ఆకాంక్షను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు గత ఫిబ్రవరిలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియానాయక్ బయ్యారంలో ఒక రోజు దీక్ష చేశారు. ఉక్కు పరిశ్రమపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు. ఈ క్రమంలో కిషన్రెడ్డి వ్యాఖ్యలపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. హామీ ఇచ్చిన విధంగా పరిశ్రమ నిర్మించకుంటే కేంద్రంపై మరో పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నది.
సాధ్యం కాదనడానికి సిగ్గుండాలి
మహబూబాబాద్ రూరల్ : బయ్యారంలో ఉక్కుపరిశ్రమ సాధ్యం కాదని చెప్పడానికి కేంద్రానికి సిగ్గు ఉండాలి. ఈ ముక్క చెప్పడానికి ఎమిదేళ్లు పట్టిందా..? బయ్యారంలో అపార ఖనిజ నిల్వలు, అన్ని అనుకూలతలు ఉన్నాయని సర్వే సంస్థలు ఏనాడో తేల్చాయి. విభజన చట్టంలో హామీలను నెరవేర్చని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి, బీజేపీ నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
– మాలోత్ కవిత, మహబూబాబాద్ ఎంపీ
ఫ్యాక్టరీ ఎందుకు సాధ్యం కాదో చెప్పాలి..
ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వడం ఇష్టం లేకనే మంత్రి కిషన్రెడ్డితో కేంద్రం ప్రకటన చేయించింది. బయ్యారంపై మొదటినుంచీ వివక్ష చూపుతూనే ఉంది. విభజన చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చినా బాధ్యతలేకుండా తప్పించుకుంటోంది. ఫ్యాక్టరీ ఎందుకు సాధ్యం కాదో కేంద్రం చెప్పాలి. కుంటిసాకులు చెప్పి చేతులెత్తేస్తే కుదరదు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి హోదాలో ఉండి కిషన్రెడ్డి అలా మాట్లాడడం సిగ్గుచేటు. ఇది ముమ్మాటికీ కిషన్రెడ్డి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమే. ఆయన మాటల్లో పరిశ్రమ ఏర్పాటు చేయకూడదనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ముడి ఖనిజంతో సహా ఎలాంటి వనరుల్లేని విశాఖ ఉక్కు పరిశ్రమ లక్షల కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. నాణ్యమైన ఖనిజంతో పాటు అన్ని వనరులున్న బయ్యారంలో పరిశ్రమ ఎందుకు సాధ్యం కాదు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
– గౌని ఐలయ్య, బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటీ కన్వీనర్
కిషన్రెడ్డి వ్యాఖ్యలు సరికాదు..
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడడం సరికాదు. విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని ఉంది. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు తన చేతకాని విధానాల వల్ల ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుసాధ్యం కాదని.. దానిని రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే నెట్టివేస్తున్నది. ప్లాంట్ ఏర్పాటుకు అన్ని అవకాశాలున్నాయి. ఇప్పటికే కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికైనా ప్రజలను మోసం చేయకుండా ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలి.
– తండా సందీప్, సీపీఐ మండల కార్యదర్శి, మహబూబాబాద్
కేంద్రమంత్రి మాటలు హాస్యాస్పదం..
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించలేమంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. గత ఎన్నికల సమయంలో సైతం ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మాట తప్పే విధంగా ప్రకటనలు చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. స్టీల్ప్లాంట్ నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పినా పట్టించుకోకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. బయ్యారం ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే.
– అంగోత్ బిందు, జడ్పీ చైర్పర్సన్, మహబూబాబాద్
న్యాయ పోరాటానికైనా సిద్ధమే..
విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉక్కు పరిశ్రమ నిర్మించాలని సీఎం కేసీఆర్తోపాటు మంత్రి కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతోనే సర్వేలు చేయించారు. స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు బయ్యారం ప్రాంతం అనుకూలమని సర్వేల్లో తేలినప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణపై కేంద్రమంత్రికి అవగాహన లేదు. ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై మరోపోరుకు వెనుకాడం.
– బానోత్ హరిప్రియానాయక్, ఇల్లందు ఎమ్మెల్యే