దుగ్గొండి, సెప్టెంబర్19 : గ్రామాల్లో నిర్దేశించిన హరితహారం లక్ష్యాన్ని అధిగమించి మొక్కలు నాటాలని జిల్లా అడిషనల్ డీఆర్డీవో వసుమతి ఆదేశించారు. సోమవారం దుగ్గొండి మండలంలోని పలు జీపీ కమ్యూనిటీ, పల్లె ప్రకృతి వనం, పాత కమ్యూనిటీల ప్లాంటేషన్, వన నర్సరీతో పాటు గ్రామంలోని జరిగిన ఈజీఎస్ పనుల రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారదర్శకంగా ఈజీఎస్ పనులను చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామస్తుల అవసరం మేరకు కావల్సిన అన్ని రకాల మొక్కలను అందించి ప్రభుత్వం నిర్ద్దేశించిన లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోల్కోండ కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, ఈజీఎస్ అధికారులు రాజు, టెక్నికల్ అసిస్టెంట్ చీర కట్టయ్య తదితరులు పాల్గొన్నారు.