భారతదేశానికి కేసీఆర్ ఆశాకిరణమని, దేశ ప్రగతి ఆయనతోనే సాధ్యమని ఉమ్మడి జిల్లా జడ్పీటీసీలు ఖరాఖండిగా చెబుతున్నారు. ప్రతి పనిలోనూ అందరినీ సమన్వయం చేసుకొని తెలంగాణను అభివృద్ధి పథాన నడుపుతున్నారని, దేశాన్ని కూడా ఇలాగే బాగుచేసే సత్తా ఆయనకే ఉందని స్పష్టం చేస్తున్నారు. ఎంతో విశిష్టత ఉన్న భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిందని, ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపాలంటే కేసీఆర్ లాంటి వ్యక్తి అవసరం ఎంతో ఉందని అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ నలుమూలలా అందాలన్నా, దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలన్నా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు.
అసమర్థ బీజేపీని గద్దె దించేది కేసీఆరే..
బయ్యారం సెప్టెంబర్ 15 : స్వార్థ ప్రయోజనాలు, రాజకీయాల కోసం పనిచేసే బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పగలిగిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆరే. దేశంలో ప్రజల బాగోగుల గురించి కాకుండా అధికారం, స్వలాభం కోసం మోదీ సర్కారు పాలన సాగిస్తున్నది. హిందూత్వం పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతూ అభివృద్ధిని అటకెక్కించింది. ఏ రాష్ట్రంలో చూసినా రైతులు, మహిళలు, కూలీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో మత సామరస్యం, అభివృద్ధితో ముందుకు సాగుతూ దేశంలో ముందువరుసలో ఉంది. అన్ని మతాలకు సముచిత గౌరవం ఇస్తూ బతుకమ్మ పండుగకు చీరలు, క్రిస్మస్కు, రంజాన్ పండుగలకు కానుకలు ఇస్తోంది. కొత్తగా ఎన్నో రాష్ర్టాలు ఏర్పడినా తెలంగాణ రాష్ట్రం ఒక్కటే తక్కువ కాలంలో ప్రగతి సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నదంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ చలవే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ప్రత్యేక లక్ష్యంతో ముందుకుసాగడం వల్లే బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోంది. ఇదే తరహాలో దేశంలోని అన్ని రాష్ర్టాలు బాగుపడాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం. ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతుబంధు లాంటి పథకాలు దేశమంతా అమలైతే రైతులు రాజులుగా మారడం ఖాయం. దేశంలో దళితులను చిన్నచూపు చూస్తున్న తరుణంలో దళితబంధు వంటి పథకం అన్ని రాష్ర్టాల్లో అమలైతే అంబేద్కర్ ఆశయాలు సాధించిన వారమవుతాం. దేశ శ్రేయస్సు దృష్ట్యా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవలందించేందుకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
– అంగోత్ బిందు, జడ్పీ చైర్పర్సన్, మహబూబాబాద్
దేశం దిశ, దశ మారుతుంది..
ములుగు రూరల్, సెప్టెంబర్ 14 : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. అప్పటినుంచి కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పరిపాలిస్తున్నా ప్రజల రాతలు మాత్రం మారలేదు. ఇప్పుడు మోదీ సర్కారు దేశ ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదు. తెలంగాణలో గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎంత?, దేశాన్ని మోదీ ఎంత అభివృద్ధి చేశాడో అందరూ గమనించాలి. ప్రస్తుతం యావత్ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు నేడు ప్రభుత్వ ఫలాలు పొందుతున్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంట్ దేశానికి ఆదర్శంగా నిలిచాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ధర్నాలు, రాస్తారోకోలు చేసేలా చేసి అరిగోస పెట్టింది. ఇంతటితో ఆగకుండా ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించింది. అందుకే మోదీ సర్కారుతో జనం విసిగిపోయారు. కానీ తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత కరెంట్, సాగునీరు ఇచ్చి అన్ని పంటలకు మద్దతు ధరకు కొంటూ రైతను రాజు చేసింది. ఇదే తీరుగా దేశంలోని అన్ని రాష్ర్టాల రైతులకు మేలైన సౌకర్యాలు రావాలంటే దేశానికి కేసీఆర్ వంటి నేత చాలా అవసరం. ఆయన దేశ రాజకీయాలకు వెళ్లడం మంచిది. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ జాతీయ పార్టీ తప్పక లక్ష్యం సాధిస్తుందని అందుకు మా వంతుగా కృషి చేసి అండగా ఉంటాం.
– సకినాల భవాని, ములుగు జడ్పీటీసీ
దేశ రైతుల చూపు కేసీఆర్ వైపు
దేవరుప్పుల, సెప్టెంబర్ 15 : తెలంగాణలో వ్యవసాయరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు చూసి దేశమే ఆశ్చర్యపోతోంది. రైతులకు పెట్టుబడి సాయం కోసం ఇచ్చే రైతుబంధు, రైతుబీమా, నిరంతరం నాణ్యమైన విద్యుత్, పుష్కలంగా సాగునీరు, మద్దతు ధరతో పంటల కొనుగోళ్లు.. ఇలా రైతుకు మేలు చేసే ప్రతి అంశం దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆకర్షించడమే కాదు.. ఆలోచింపచేస్తున్నది. తమ రాష్ర్టాల్లోనూ ఇలాంటి పథకాలు ఉండాలని.. రైతులు బాగుపడాలని ఎంతో ఆశపడుతున్నారు. కేసీఆర్కు ఉన్న అవగాహనతో దేశంలో సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయనే నమ్మకం అటు రైతులతో పాటు దేశ ప్రజల్లోనూ కలిగింది. దేశానికి రైతే వెన్నెముక, రైతే రాజు, జై కిసాన్ అని చెప్పుకొనే దేశంలో ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు వల్ల రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్ధితి దాపురించిన తరుణంలో కొత్త నాయకత్వం కోసం దేశ రైతాంగమంతా ఎదురుచూస్తున్నది. దేశాన్ని పాలించడంలో మోదీ సర్కారు విఫలమైనందున ఇక ప్రత్యామ్నాయం కేసీఆరేనని ప్రజలంతా భావిస్తున్నారు. ఆయన నేతృత్వంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పడితే దేశ ప్రజలు జేజేలు పలుకుతారనేది అక్షర సత్యం.
– పల్లా భార్గవిరెడ్డి, జడ్పీటీసీ, దేవరుప్పుల
దేశం బాగుపడుతది
హనుమకొండ సబర్బన్, సెప్టెంబర్ 17 : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే భారత జాతి మొత్తం బాగుపడుతది. అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయి. ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం వల్ల దేశానికి ఎంతో నష్టం జరిగింది. అనవసరమైన మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి. ప్రజల సంక్షేమానికి ఎల్లా పాటుపడాలనే సోయిలేదు. కార్పొరేట్కు లాభం జరిగేలా వ్యవహరిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం రాక మునుపు అదాని అంటే ఎవరో కూడా తెల్వదు. అట్లాంటిది. కేవలం మూడేళ్లలో ప్రపంచ ఆర్థిక కుబేరులల్ల మూడో స్థానానికి ఎగబాకిండంటే అతనికి బీజేపీ ప్రభుత్వం ఏ స్థాయిలో సహకరిస్తుందో తేటతెల్లమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల్లో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇలాంటి అసమర్థ ప్రభుత్వం పోవాలంటే సెక్యులర్ భావజాలం ఉన్న కేసీఆర్ భారత రాజకీయాల్లోకి వెళ్లాలి. దేశంలో ముఖ్య భూమిక పోషించాలి. ఆయన వల్ల తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దేశం మొత్తంలో అమలవుతాయి.
– మారపల్లి సుధీర్ కుమార్,జిల్లా పరిషత్ చైర్మన్, హనుమకొండ
అన్ని అంశాలపైపట్టున్న నేత
వర్ధన్నపేట, సెప్టెంబర్ 15 : 14 ఏళ్లపాటు రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన కేసీఆర్కు ప్రతి అంశం, సమస్యపై అవగాహన ఉంది. రాష్ర్టాలు, దేశ అభివృద్ధి ఏవిధంగా చేయాలనే విషయంపై కేసీఆర్కు మంచి విజన్ ఉంది. ప్రజా సమస్యలపై పూర్తి పట్టున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తే భారతదేశ రూపురేఖలు మారిపోతాయి. ప్రపంచంలో దేశం అగ్రదేశంగా నిలుస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి గ్రామం, గూడెం, తండాలను సందర్శించిన కేసీఆర్కు అన్ని వర్గాలపై అవగాహన ఉంది. ప్రపంచ పరిజ్ఞానం ఉన్న మేధావి కేసీఆర్. ప్రధానంగా నదీజలాలు, విద్యుత్ రంగం, సేవారంగం, విద్య, వైద్యం.. ఇలా అన్నింటి గురించి క్షుణ్ణంగా తెలుసు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని తెలిసి తెలంగాణ ప్రజలతో పాటు దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు, మేధావులు, రైతు సంఘాల నాయకులు సంతోషం వ్యక్తంచేయడంతో పాటు స్వాగతిస్తున్నారు. కేసీఆర్ దేశ ప్రధాని అయితే తెలంగాణ తరహాలోనే అన్ని ప్రాంతాలు సస్యశ్యామలమై అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించి దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటారు.
– మార్గం భిక్షపతి, వర్ధన్నపేట జడ్పీటీసీ