నర్సంపేట, సెప్టెంబర్ 15: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని మార్కెట్ ఆవరణలో సభకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించనుందని తెలిపారు. శుక్రవారం నర్సంపేట నియోజకవర్గ స్థాయిలో 15 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభ కోసం పది వేల చిన్న జాతీయ జెండాలు, 50 పెద్ద జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తామని చెప్పారు. పట్టణంలో జరిగే ఈ సభకు నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
నర్సంపేట ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు సకల జనులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు భోజన వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 17న జిల్లా హెడ్క్వార్టర్లో జాతీయ జెండాల ఆవిష్కరణ ఉంటుందని, అదే రోజు హైదరాబాద్లో బంజారా భవన్, సేవాలాల్ భవన్ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. ఈ నెల 18న జిల్లాకేంద్రాల్లో సాంస్కృతిక ప్రదర్శనలను ఘనంగా నిర్వహిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో పవన్కుమార్, ఏసీపీ సంపత్కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, సీఐలు పులి రమేశ్గౌడ్, సూర్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, నల్లా మనోహర్రెడ్డి, రాయిడి రవీందర్రెడ్డి, ఎంపీపీ విజేందర్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, మారం రాము పాల్గొన్నారు.
సభ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ స్థలాన్ని కలెక్టర్ గోపి పరిశీలించారు. కుర్చీలు, టెంట్లు, పాండాల ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు భోజనాలను ఎలాంటి ఇబ్బంది కలుగకుండా టేబుల్స్ వేయాలని సూచించారు. క్యాటరింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. ఒకేసారి పెద్ద ఎత్తున ప్రజలు భోజనాలకు రావడం వల్ల ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ హరిసింగ్, మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, తహసీల్దార్ రామ్మూర్తి, ఎస్సై రవీందర్ ఉన్నారు.
నేడు 15 వేల మందితో సభ
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా నర్సంపేట మార్కెట్ ఆవరణలో శుక్రవారం నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 15 వేల మందికి పైగా వచ్చే ఈ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ముందుకు పట్టణంలో వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. సభ అనంతరం భోజనాలు పెట్టనున్నారు. సభను విజయవంతం చేయాలని ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు.