కరీమాబాద్, సెప్టెంబర్ 11: మద్యం తాగి వాహనాలు నడుపడం చట్టరీత్యా నేరమని తెలిసినా కొందరు వాహనదారులు మారడం లేదు. పని ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో, రాత్రిపూట ప్రయాణం చేసే సమయంలో చాలా మంది మద్యం మత్తులోనే వాహనాలు నడుపుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ మేరకు మామునూరు పోలీసులు మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాత్రివేళలో గస్తీ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో సిబ్బందికి విడుతల వారీగా రాత్రి వేళ విధులు వేస్తూ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
పార్టీలు జరిగే ప్రదేశాల్లో..
మామునూరు పోలీస్స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. డ్రైవర్లు రోడ్ల పక్కన వాహనాలు నిలిపి హోటళ్లలో భోజనం చేసి వాహనాలు నడుపుతుంటారు. కళాశాల విద్యార్థులు సైతం రాత్రి పూట బయటకు వెళ్లి తిరిగి హాస్టళ్లకు వెళే సమయాల్లో వేగంగా వెళ్తుంటారు. నగరానికి దూరంగా ఉండడంతో పార్టీలు సైతం ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మామునూరు పోలీసులు రాత్రి వేళ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. నైట్ డ్యూటీలో ప్రత్యేకంగా వాహనాలను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు. రాత్రి వేళ ఎవరూ ఉండరనుకొని మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని పట్టుకొని జరిమానాలతోపాటు జైలుశిక్ష విధిస్తున్నారు.
మద్యం మత్తులో ఉన్న వారిపై చర్యలు
మామునూరు రోడ్డులో ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడుతున్నాం. రాత్రిపూట స్పెషల్ డ్రైవ్ ద్వారా వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపడుతున్నాం. రాత్రివేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
– క్రాంతికుమార్, సీఐ మామునూరు