పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 4 : మహాభాగవత సృష్టికర్త బమ్మెర పోతన నడయాడిన నేల ఓ పుణ్యభూమి అని కలంతో పాటు హలం పట్టిన గొప్ప కవి పోతనామాత్యుడని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహాకవులకు పాలకుర్తి పుట్టినిల్లు అని పేర్కొన్నారు. పోతన జయంతిని పురస్కరించుకుని ఆదివారం పాలకుర్తి మండలం బమ్మెరలో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి హాజరుకాగా, కవులు, కళాకారులు, డప్పుచప్పుళ్ల నడుమ మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. తొలుత పోతనామాత్యుడికి మంత్రి ఎర్రబెల్లి నివాళులర్పించారు. పోతన సమాధి పనులను పరిశీలించారు. ఆ తర్వాత సర్పంచ్ జలగం నాగభూషణం అధ్యక్షతన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ పోతన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు.
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది బమ్మెరలో పోతన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. పాలకుర్తిలో పాల్కురికి సోమనాథుడు, బమ్మెరలో పోతన, వల్మిడిలో వాల్మీకి మహాముని జన్మించాడన్నారు. మహాకవులను గన్న ఈ నేలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నానన్నారు. బమ్మెరను మరో బాసరగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. బమ్మెర పోతన ఆత్మాభిమానం కలిగిన సహ జ కవి అని కొనియాడారు. పోతన బమ్మెరలో పుట్టడం ఈ ప్రాంత ప్రజల వరమన్నారు. పోతన ప్రపంచ కవి అని పేర్కొన్నారు. సమైక్యపాలనలో కవులు, కళాకారులకు గుర్తింపు లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గుర్తింపు లభించిందన్నారు. సీఎం కేసీఆర్కు నచ్చిన కవి బమ్మెర పోతన అని మెచ్చిన ప్రాంతం బమ్మెర అని మంత్రి చెప్పారు. అందుకోసమే సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి బమ్మెరలో టూరిజం కింద జిల్లాకు రూ.40 కోట్లు నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. అదనంగా నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
పాలకుర్తికి రూ.10కోట్లు, బమ్మెరకు రూ.7.50కోట్లు, వల్మిడికి రూ.5కోట్లు మంజూరు చేశారని వివరించారు. అలాగే సోమేశ్వరాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశానన్నారు. బమ్మెర గ్రామాన్ని అన్నింటా అభివృద్ధి చేస్తానని, గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి పోతన జయంతి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. త్వరలో బమ్మెరలో పోతన, పాలకుర్తిలో సోమనాథుడి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తానని మంత్రి చెప్పారు. కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ పోతన గొప్పకవి అని తన రచనలు రాజులకు కాకుండా రాముడికి అంకితం చేసిన గొప్ప కవి, రచయిత అని పేర్కొన్నారు. పోతన రచనలు పండితులు, పామరులకు అర్థమమ్యే రీతిలో సరళంగా ఉంటాయని చెప్పారు. జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి మాట్లాడుతూ పోతన పుట్టిన బమ్మెర ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం అభినం ద నీయమన్నారు.
పర్యాటక పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ గంట రవీంద ర్, డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి, ఇన్టాక్ చైర్మన్ ప్రొ ఫెసర్ పాండురంగారావు, డీపీఓ రంగాచారి, డీఆర్డీఓ గూడూరు రాంరెడ్డి, ఏపీడీ ఎండీ నూరొద్దీన్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతా రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మ దార్, వైస్ ఎంపీపీ దార శారద, రంగినేని సత్యనారాయణ, ఉపసర్పంచ్ శివరాత్రి సుధాకర్, బత్తిని గోపాల్, రాపాక సత్యనారాయణ, బత్తిని కుమార్, పెందోట వెంకటాచారి, మాడరాజు యాకయ్య, జోగు గోపి, జిట్టబోయిన కొంరెల్లి, దార ఈశ్వయ్య, మారం రవికుమార్ పాల్గొన్నారు.
మార్మోగిన పోతన నామస్మరణ
జయంతి ఉత్సవాల సందర్భంగా పోతన నామస్మరణతో బమ్మెర మార్మోగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాకారుల ఆటాపాటలతో ఊరంతా కళకళలాడగా, కవులు పాడిన పాటలు, పద్యాలతో సభాప్రాంగణం సాహితీ పరిమళాలను వెదజల్లింది. శ్రీ హర్ష చేసిన అష్టావధానం ఎంతోగానో ఆకట్టుకుంది. కవి సమ్మేళనాలతో ఆ ప్రాంతమంతా సంతోషం నింపింది. సుప్రసిద్ధ కవులు కోవెల సుప్రసన్నాచార్యులకు స్వర్ణ కంకణం, ప్రొఫెసర్ రామాచంద్రమౌళికి ఉంగరం తొడిగి ఘనంగా సత్కరించా రు. అష్టావధాని శ్రీ హర్షతోపాటు గిరిజామనోహర్రావు, గౌరిభట్ల రఘురామాశర్మ, ఎన్వీఎన్ ఆచార్య, సదానందాచారి, రంగాచార్యులు, గంగరాజు శ్రీనివాసచార్యులు, అంజని, ఎల్లం బట్ల నాగయ్య, అన్నావఝుల సాంబాబు, పానుగంటి రామమూర్తి, కొండ యాదగిరి తదితర కవులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. జయంతి సందర్భంగా బమ్మెర గ్రామమంతా పోతన చిత్రపటాలతో నిండిపోయింది. చిందు కళాకారులు గడ్డం సమ్మయ్య, గడ్డం జలేంధర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన చిందు యక్షగానం, చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.