వరంగల్, ఆగస్టు 26: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. 66 డివిజన్లలో నూతనంగా 14,248 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి పింఛన్లు అందించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో అన్ని కేటగిరీలు కలుపుకుని 66,178 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా 14,248 మందికి ప్రభుత్వం మంజూరు చేయడంతో గ్రేటర్ పరిధిలో 80,426 మందికి పింఛన్లు అందనున్నాయి. హనుమకొండ జిల్లా పరిధిలోని డివిజన్లలో 6,115, వరంగల్ జిల్లా పరిధిలోని డివిజన్లలో 8,103 మందికి పింఛన్లు మంజూరయ్యాయి.
పింఛన్కార్డుల తయారీ..
కొత్త పింఛన్లను వచ్చే నెల నుంచి పంపిణీ చేయనున్నారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లకు సంబంధించిన కార్డులను కార్పొరేషన్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. రెండుమూడు రోజులలో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు ప్రొసీడింగ్ కాపీలతో కార్డులను అందజేయనున్నారు. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
57 ఏళ్ల నిండిన వారికి ఆసరా
57 ఏళ్లు నిండిన 14,248 మందికి పింఛన్లు మంజూరు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను విచారణ చేసి అర్హులైన వారికి మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.