జఫర్గఢ్, ఆగస్టు 23 : స్టేషన్ఘన్పూర్ మండలం పామునూరు శివారులో ఎలాంటి అనుమతి లేకుండా మంగళవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టడంతో పోలీసులు భగ్నం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా అతడిని అదుపులోకి తీసుకొని కరీంనగర్కు తరలించి హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి జనగామ జిల్లాలో బండి యాత్ర కొనసాగుతుండగా సోమవారం రాత్రి పామునూరు శివారులో బసచేసిన ఆయన మంగళవారం జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు, కూనూరు గ్రామాల మీదుగా పాదయాత్ర సాగాల్సి ఉంది. అయితే హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడి ఘటనలో బీజేపీ నాయకులు, కార్యకర్తల అరెస్టు, అక్రమ కేసులను ఎత్తివేయాలని పామునూరు శిబిరం వద్ద ధర్మదీక్ష చేపడుతున్నట్లు బండి సంజయ్ ఆకస్మికంగా ప్రకటించారు. కవిత ఇంటిపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీజేపీ పాదయాత్రను అడ్డుకునేందుకు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు ఆధ్వర్యంలో వందలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉప్పుగల్లుకు చేరుకున్నారు. ఫ్లెక్సీల ధ్వంసం, దగ్ధం వంటి రెచ్చగొట్టే చర్యలతో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మోహరింపుతో జఫర్గఢ్ మండలంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో అప్రమత్తమైన పోలీసులు దీక్షకు అనుమతి లేదని, శాంతిభద్రతల దృష్ట్యా బండి సంజయ్ను ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు శిబిరం వద్ద ప్రకటించారు. బండిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో శిబిరం వద్ద ఉన్న స్థానికేతరులైన బీజేపీ శ్రేణులు ఏసీపీ సహా సీఐలు, ఎస్సైలు, బలగాల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బండి సంజయ్ శిబిరం వద్ద నియోజకవర్గానికి చెందిన బీజేపీ శ్రేణులు కొద్ది సంఖ్యలో ఉండగా, బయటినుంచి వచ్చిన బీజేపీ శ్రేణులు, పార్టీ క్యాడర్ ముసుగులో ఉన్న బౌన్సర్లు, కాషాయ కండువాలు కప్పుకున్న రౌడీలు, గూండాలు పెద్ద సంఖ్యలో ఉండి పోలీసుల వాహనాలను పలుమార్లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, పార్టీ శ్రేణులకు మధ్య పెద్దఎత్తున తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇలా శిబిరం వద్ద గంట పాటు హైటెన్షన్ కొనసాగింది. వరంగల్ సీపీ తరుణ్జోషి ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణుల తోపులాటల మధ్య నే బండి సంజయ్ని పోలీసు వాహనాల్లో స్టేషన్ఘన్పూర్ మీదుగా కరీంనగర్కు తరలించారు.
టీఆర్ఎస్ నాయకుల వాహనాల అద్దాలు ధ్వంసం..
బండి సంజయ్ పాదయాత్రను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలకు హాజరైన టీఆర్ఎస్ నాయకుల కారు అద్దాలను జఫర్గఢ్ మండలం కూనూరులో బీజేపీ గూండాలు పగులగొట్టారు. ఉప్పుగల్లు నుంచి కూనూరు మీదుగా జఫర్గఢ్ వైపు వెళ్తున్న టీఆర్ఎస్ నాయకుల కార్లను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. తమ నేతను పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా? అంటూ టీఆర్ఎస్ నాయకుల కారు అద్దాలను కర్రలు, రాడ్లతో ధ్వంసం చేశారు. ఒకదశలో అదేకారులో ఉన్న టీఆర్ఎస్ నాయకులపై దాడికి బీజేపీ గూండాలు యత్నించగా, అక్కడినుంచి తప్పించుకొని వెళ్లాల్సి వచ్చింది. గుజరాతీలకు గులాంగిరీ చేస్తున్న ‘బానిస సంజయ్’ గోబ్యాక్ అంటూ ఉప్పుగల్లులో టీఆర్ఎస్ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు నల్లజెండాలు.. చెప్పులతో నిరసనకు దిగారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాతీయులకు తాకట్టు పెట్టిన బండికి తెలంగాణ లో పాదయాత్ర చేసే హక్కు లేదని.. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్పై కేసు నమోదు
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 23 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై 151 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల సంక్షేమం కోసం కాకుండా సంగ్రామ యాత్ర పేరుతో ఇతర పార్టీల పరువు తీయడమే లక్ష్యంగా రెచ్చగొట్టే ప్రసం గాలు చేస్తున్నందుకు శాంతిభద్రతలకు విఘా తం కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.