వర్ధన్నపేట, ఆగస్టు 23: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట బ్లాక్ ఆఫీస్ సముదాయంలో రూ. 23 లక్షల వ్యయంతో నిర్మించిన బృందావన మండల సమాఖ్య భవనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మండల సమాఖ్య అధ్యక్షురాలు సమ్మక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో అరూరి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకొని మహిళలు కుటీర, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయల బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారని గుర్తుచేశారు. తీసుకున్న రుణాలను ఇంటి అవసరాలకు కాకుండా ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడి పెడితే ఆర్థిక ప్రగతి సాధిస్తారని తెలిపారు.
కేరళ రాష్ట్రం తరహాలో ఉత్పత్తి కేంద్రాలు
నియోజకవర్గ స్థాయిలో మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి కేంద్రాలను కేరళ రాష్ట్రం తరహాలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అరూరి వెల్లడించారు. వర్ధన్నపేట గుర్తింపుతో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు నిపుణుల సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు మామిడి పంటను కూడా కొంటున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు వాటిని ప్రజలకు ఉపయోగపడేలా మహిళా సంఘాలతో తయారు చేయించి విక్రయించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. తర్వాత మహిళా సంఘాలకు మంజూరైన రూ. 23 లక్షల చెక్కును అరూరి అందజేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే రమేశ్కు మండల సమాఖ్య, సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఎం సంపత్రావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, ఈఈ శంకరయ్య, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, తాసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఏపీఎం వేణు, వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.