రాయపర్తి, ఆగస్టు 13: క్షణికావేశంలో చేసిన తప్పిదాలతో మండలంలోని మూడు గిరిజన తండాల ప్రజలు 15 రోజులుగా అజ్ఞాతవాసంలో గడుపుతున్నారు. ఇండ్లకు తాళాలు వేసి వ్యవసాయ పనులు మానుకొని ప్రాణ భీతితో తలదాచుకుంటున్నామని వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని జయరాంతండా(ఎస్) జీపీ పరిధిలోని సూర్యతండాకు చెందిన తేజావత్ గంగమ్మ, యాకూబ్ దంపతుల కుమార్తె మమత(25)ను మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని అజ్మీరాతండా శివారు ఆనకట్టతండాకు చెందిన భూక్యా రవీందర్కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా గత నెల 26న మమతను భర్త రవీందర్ గొడ్డలితో నరికి హత్య చేసినట్లు తెలిసింది. మమత మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు తేజావత్ గంగమ్మ-యాకూబ్తోపాటు దరియాతండా, శ్రీరామ్నగర్తండా, సూర్యతండాలోని బంధుమిత్రులంతా కలిసి వాహనాల్లో ఆనకట్టతండాకు చేరుకున్నారు. మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించే క్రమంలో బంధుమిత్రులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఇరువర్గాల మధ్య పెనుగులాట జరిగి పరస్పర దాడులు జరిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు మృతురాలి బంధుమిత్రులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే, మమత బంధువులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలియడంతో గిరిజనులంతా భయందోళనతో తండాలను వదిలిపెట్టి పారిపోయినట్లు సమాచారం. దీంతో మంచానికే పరిమితమైన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, మూగజీవాలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. తమ సెల్ఫోన్లను స్విచ్చాఫ్ చేసి పరారీలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వారికి అవగాహన కల్పించి తండాల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.