కాజీపేట, ఆగస్టు 13: దాదాపు 40 ఏండ్ల నుంచి రైలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ కుటుంబాలను పోషించుకుంటున్న కాజీపేట రైల్వే జంక్షన్ ఆటో డ్రైవర్లను రైల్వే అధికారులు క్యాబ్ ట్యాక్స్ (పన్ను) చెల్లించాలని వేధించడం సరికాదని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ ప్రాంగణం ఆటో అడ్డాలోని ఆటో డ్రైవర్లను రైల్వే అధికారులు క్యాబ్ ట్యాక్స్ చెల్లించాలని ఒత్తిడి చేస్తూ శనివారం ప్రయాణికులను తీసుకెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఎంపీ, చీఫ్విప్ ఘటనా స్థలానికి వచ్చి రైల్వే అధికారులతో సంప్రదింపులు జరిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పేదలపై పెనుభారంగా వేస్తున్నదని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు ఏర్పాటైన కాజీపేట రైల్వేస్టేషన్లో ప్రస్తుతం రైలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న ప్రతి ఆటో డ్రైవర్ ట్యాక్స్ చెల్లించాలని కొంతకాలంగా రైల్వేశాఖ ఒత్తిడి చేస్తున్నదన్నారు. ఆటో డ్రైవర్లపై వేస్తున్న టాక్సీని ఖండిస్తున్నామన్నారు.
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రైల్వే ఆస్తులను ధారాదత్తం చేస్తూ సామాన్య ప్రజలను ట్యాక్స్ పేరుతో పీడించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైల్వే జంక్షన్ నుంచి ప్రయాణికులను తీసుకెళ్లుతున్న ప్రతి ఆటో డ్రైవర్ ఏడాదికి ఏడు వేల రూపాయలు చెల్లించాలని రైల్వే అధికారులు అక్రమంగా పన్ను విధించేందుకు చేస్తున్న కుట్రను ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకునేందుకు దశల వారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎంతో చర్చించి కాజీపేట రైల్వే జంక్షన్ అడ్డాలోని ఆటోలకు ట్యాక్స్ లేకుండా లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. రైల్వే అధికారులు విధిస్తున్న పన్నును రద్దు చేసే వరకూ టీఆర్ఎస్ ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆటో కార్మికులు నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, టీఆర్ఎస్ నాయకులు కనుకరాజు, మర్యాల కృష్ణ, సుంచు అశోక్, దువ్వ నరేశ్, రఘు, ఆటో యూనియన్ నాయకులు గడ్డం నరహరి, భూక్యా శంకర్, నజీరుద్దీన్, సత్యానారాయణ, రవీందర్, రైల్వే అధికారులు రాజగోపాల్, బాలరాజు, ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు ఉన్నారు.