వరంగల్, ఆగస్టు 7(నమస్తేతెలంగాణ) : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని కొత్త పింఛన్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అర్హులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల పదిహేను నుంచి తమకు పింఛన్ అందనుందని సంబుర పడుతున్నారు. తీపి కబురు చెప్పిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో యాభై ఏడేళ్ల వయసున్న వారికి పంద్రాగస్టు కానుకగా ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని, తద్వారా పది లక్షల మంది లబ్ధిపొందుతారని సీఎం శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 57 ఏండ్ల వారికి పింఛన్ ఇస్తామన్నాం. పాపం వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. మధ్యలో కరోనాతో ఆర్థిక మాంద్యం వచ్చింది.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం బంద్ చేసింది.. అందుకే ఆలస్యం అయింది. మొత్తం లిస్టు తీసినం. ఇప్పుడు కొత్తగా పది లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పింఛన్ వస్తుంది. కొత్తగా ఇచ్చే వాటితో మొత్తం 46 లక్షల మందికి అందుతాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో కొత్తగా 33 వేల మందికిపైగా ప్రయోజనం కలుగనుంది. ఆసరా పథకం నుంచి నెల నెలా వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, గీత కార్మికులు, వీవర్స్, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలకు పింఛన్ అందజేస్తున్నది. జిల్లాలోని పదమూడు మండలాల్లో ప్రతి నెలా 1,01,956 మందికి రూ.22,83,36,784 పింఛన్ ఇస్తున్నది. వీరిలో వృద్ధులు 33,192, వితంతువులు 41,654, దివ్యాంగులు 14,074, గీత కార్మికులు 2,5574, వీవర్స్ 2,070, బీడి వర్కర్లు 5,591, ఒంటరి మహిళలు 2,801 మంది ఉన్నారు. దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పింఛన్ అందజేస్తున్నది. మిగతా వారికి రూ.2,016 ఇస్తున్నది. అత్యధికంగా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని 41,164 మందికి రూ.8,73,41,928 పింఛన్ అందుతున్నది.
వీరిలో వృద్ధులు 10,998, వితంతువులు 17,845, దివ్యాంగులు 4,675, గీత కార్మికులు 269, వీవర్స్ 1,469, బీడీ వర్కర్లు 4,958, ఒంటరి మహిళలు 950 మంది ఉన్నారు. మండలం వారీగా రాయపర్తిలో 6,396, నెక్కొండలో 6,321, దుగ్గొండిలో 5,934, సంగెంలో 5,886, పర్వతగిరిలో 5,309, నల్లబెల్లిలో 4,753, వర్ధన్నపేటలో 4,486, నర్సంపేటలో 4,459, చెన్నారావుపేటలో 4,412, గీసుగొండలో 4,064, ఖానాపురంలో 3,925 మంది పింఛన్ పొందుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 3,534, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 1,313 మంది పింఛన్ అందుకుంటున్నారు. ఈ 1,01,956 మంది లబ్ధిదారులతో పాటు కొత్తగా 57 ఏండ్లవారికి ఆసరా పథకం ద్వారా పింఛన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
వివరాలు సేకరిస్తున్న అధికారులు..
కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో ఆసరా పథకం ద్వారా జిల్లాలో 33వేలకుపైగా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 57 ఏండ్ల వారికి కూడా ఆసరా పథకం ద్వారా పింఛన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించడానికి ముందు జిల్లాలోని పదమూ డు మండలాల్లో ఈ పథకానికి 14,190 మంది అర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 65 ఏండ్లు నిండిన వారితో పాటు వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, వీవర్స్, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఆసరా పథకం ద్వారా పింఛన్ మంజూరు చేయాలని అధికారులు 14,190 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి పం పారు. ఆ తర్వాత 57 ఏండ్ల వయసున్న వారికి కూడా పింఛన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అర్హులను గుర్తించి జాబితా రూపొందించారు. 57 ఏండ్ల వారు కూడా తమకు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు పంపా రు. ఈ దరఖాస్తులు 19,281 ఉన్నట్లు తెలిసింది.
స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్లు అందజేయాలనే ప్రభు త్వ నిర్ణయంతో జిల్లా నుంచి ఒకసారి 14,190, మరోసారి 19,281 మంది పేర్లతో వేర్వేరుగా అంది న జాబితాల్లో 33 వేలకు పైగా మందికి పింఛన్ అం దనుంది. అలాగే, పాతకార్డుల స్థానంలో బార్కోడ్తో కొత్త కార్డులు ఇస్తామని, ఎమ్మెల్యేలు గ్రామ సభలు, సమావేశాలు పెట్టి కార్డులను పంపిణీ చేస్తారని కూడా ముఖ్యమంత్రి ప్రకటించడంతో కొత్త కార్డుల కోసం వేచిచూస్తున్న వారిలో ఆనందం వెల్లివిరుస్తున్నది. డయాలసిస్ రోగులకూ ఇకపై నెలనెలా పింఛన్ అందనుంది. ఇప్పటికే వీరికే ఉచితంగా డయాలసిస్ చేస్తున్న ప్రభుత్వం బస్ పాసులనూ అందజేసింది. సీఎం కేసీఆర్ ప్రకటనతో అధికారులు డయాలసిస్ పేషెంట్ల సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.