ఖిలావరంగల్, ఆగస్టు 7: చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఓరుగల్లు కోటలో స్వయంభూ దేవాలయానికి నలువైపులా నాలుగు శిలా తోరణాలు రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల యశఃస్తంభాల వలే కనిపిస్తూ నేటికీ ఆనాటి ఘనతను చాటుతూనే ఉన్నాయి. అయితే, కాకతీయుల కళావైభవాన్ని నలువైపులా చాటుతూ సగర్వంగా నిలబడి ఉన్న కీర్తితోరణాలను వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కోటకు వస్తున్న పర్యాటకులను సమస్యలు వెంటాడుతున్నాయి. కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో స్థానికులు, యాత్రికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం వందల సంఖ్యలో కోటకు వస్తున్న పర్యాటకులకు కనీస వసతులు కల్పించడంలో ఆ శాఖ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మెట్లు ఎక్కాలంటే ఇబ్బంది..
మొదట పర్యాటకులకు టికెట్ కౌంటర్ నుంచే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిన్నపాటి రేకుల డబ్బాలో టికెట్ కొనుగోలు చేసిన పర్యాటకులు పది భారీగా ఉన్న మెట్లను దిగి శిల్పాల ప్రాంగణంలోకి వెళ్లాల్సి వస్తున్నది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఈ మెట్లు దిగడానికి పడుతున్న అవస్థలు అన్నీఇన్ని కావు. కొంతమంది వృద్ధులు కీర్తితోరణాల మధ్య ఉన్న శిల్పసంపదను వీక్షించకుండానే వెనుదిరుగుతున్నారు. రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించే కేంద్ర పురావస్తు శాఖ ఉద్యోగులు వర్షం వస్తే నిల్వనీడ లేదనే విమర్శలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం చేయాలన్నా కేంద్ర పురావస్తు శాఖ ఉద్యోగులు, సిబ్బంది చెట్ల నీడనే ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇదిలా ఉండగా దూర తీర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు తమ వెంట బ్యాగ్లు తీసుకురావడం సహజం. అయితే, వచ్చిన పర్యాటకులు పెద్దపెద్ద బ్యాగులను భద్రపర్చుకునేందుకు క్లాక్ రూములు లేవు. దీంతో పర్యాటకులు లగేజీ బ్యాగ్లను చేతపట్టుకొని కీర్తి తోరణాల ప్రాంగణంలోని శిల్పసంపదను వీక్షిస్తున్నారు. ఏకశిలగుట్ట, ఖుష్మహల్ తదితర చారిత్రక కట్టడాల వద్దకు లగేజీ బ్యాగ్లను మోయలేక, భద్రపర్చేందుకు క్లాక్ రూములు లేకపోవడంతో కేంద్ర పురావస్తు శాఖపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న చారిత్రక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. అలాగే, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినా అవి ముందుకు సాగకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పనుల్లో పురోగతి శూన్యం..
కీర్తితోరణాల ప్రాంగణంలో తాత్కాలిక షెడ్ వేయడం.. తొలగించడమే తప్ప కొత్తగా నిర్మించతలపెట్టిన పనుల్లో పురోగతి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్యాటరీ ఆపరేటర్ వాహనం కోసం కీర్తితోరణాల మధ్య ట్రాక్ను ఏర్పాటు చేశారు.
ఈ వాహనంలో దివ్యాంగులు, వృద్ధులు శిల్పాలను అతిదగ్గరి నుంచి చూసి హర్షం వ్యక్తం చేశారు. కొంతకాలం వాహనం పని చేసిన తర్వాత టెక్నికల్ సమస్య రావడంతో రిపేర్కు పంపించారు. వాహనం లేకపోవడంతో పాత ట్రాక్ను తీసివేసి మరో ట్రాక్ను ఏర్పాటు చేయడం అనుమానాలకు దారితీస్తున్నది. పర్యాటకులకు పనికొస్తే పనుల్లో జాప్యం చేస్తూ కాంట్రాక్టర్లకు లాభాలు తెచ్చే పనులను చేపడుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణంలో ఉన్న టికెట్ కౌంటర్లు, క్లాక్ రూములు, ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మరో గది పనులను త్వరగా పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.