వర్ధన్నపేట, జూలై 2 : ఆకేరువాగు ఒడిలో ఇక ఏడాదంతా గంగమ్మ నిలిచి ఉండనున్నది. 2014కు ముందు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, రాయపర్తి, జఫర్గఢ్ మండలాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. వర్షాలు కురిసిన సమయంలో వాగులో నీరంతా వృథాగా కిందికి వెళ్లిపోయేది. దీంతో పంటలు పండించుకునే అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆకేరువాగులో ఏటా వర్షాకాలంలో నీరు ప్రవహించినా ఈ ప్రాంత ప్రజలు, రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండడం లేదు. స్థానిక రైతులు, ప్రజలు ఆకేరువాగుపై చెక్డ్యామ్లు నిర్మించాలని గత పాలకులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించేందుకు అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా ఆకేరువాగుపై చెక్డ్యామ్లు కట్టాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారుల ప్రతిపాదనల మేరకు కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల సమీపంలో రెండు బ్రిడ్జి కమ్ చెక్డ్యామ్లు నిర్మించేందుకు రూ.33 కోట్లు మంజూరు చేసింది.
ముమ్మరంగా పనులు
బ్రిడ్జి కం చెక్డ్యామ్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం 2020లో రూ.33 కోట్లు మంజూరు చేయగా, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వర్షాకాలంలోనే వాగులో నీరు నిలిచి ఉండేలా పనుల్లో వేగం పెంచారు. కొత్తపల్లి సమీపంలో రూ.15 కోట్లతో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇది పూర్తయితే కొత్తపల్లి శివారు నుంచి గంగదేవిమాటు వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర వాగులో నీరు నిలిచి ఉంటుంది. కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాలతో పాటు రాయపర్తి మండల ప్రజలు నేరుగా ఇల్లందకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇల్లంద-కొత్తపల్లి రోడ్డు నిర్మాణానికి కూడా నిధులు మంజూరయ్యాయి. వరంగల్ వెళ్లే వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. ల్యాబర్తి సమీపంలో రూ.18 కోట్లతో నిర్మిస్తున్న చెక్డ్యామ్ కమ్ బ్రిడ్జి పనులు త్వరలో నే పూర్తి కానున్నాయి. అందుబాటులోకి వస్తే ల్యాబర్తి శివారు నుంచి కొత్తపల్లి సమీపం వరకు ఏడాదంతా వాగులో నీరు నిలిచి ఉంటుంది. ల్యాబర్తి, చంద్రుతండా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
ఫలించిన ఎమ్మెల్యే ‘అరూరి’ కృషి..
వాగుపై బ్రిడ్జి కమ్ చెక్డ్యామ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే అరూరి రమేశ్ చేసిన కృషి ఫలించింది. వీటి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్ను కలిసి వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు చెక్డ్యామ్ల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాన్ని వివరించారు. దీంతో సీఎం కేసీఆర్ రూ.33 కోట్లు మంజూరు చేయించారు. గతేడాదే పనులు ప్రారంభం కాగా, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండడంతో చివరి దశకు చేరుకున్నాయి.
గంగమ్మ పైపైకి..
వాగులో నీరు నిలిచి ఉండడం వల్ల భూగర్భ జలాలు భారీగా పెరిగి బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు లభిస్తుందని ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుమారు 300 నుంచి 400 ఫీట్ల లోతు బోర్లు వేసినా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం చెక్డ్యామ్లు పూర్తయితే భూగర్భ జలాలు పెరుగనున్నాయి. ఇప్పటికే రైతులు బోర్లు వేయడం తగ్గించి చెరువులు, ఎస్సారెస్పీ నీటితో పంటలు సాగు చేసుకుంటున్నారు.