గీసుగొండ, జూన్ 26: గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు పనిచేయకపోవడం, చాలా ప్రాంతాల్లో లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. మండలంలో సుమారు పది గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విశ్వనాథపురం, వంచనగిరి, ఎలుకుర్తి, కొనాయిమాకులతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లో నిర్వహణ సరిగా లేకపోవడంతో సీసీ కెమెరాలు పని చేయడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. శాయంపేట, దస్రుతండా, సూర్యతండా, నందనాయక్తండా, అనంతారం, మనుగొండ, బొడ్డుచింతలపల్లి, రాంపూరంలో ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటుకు నోచుకోలేదు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని గ్రామ పంచాయతీల తీర్మానం ద్వారా బిల్లులు తీసుకునే వెసులుబాటు ఉన్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్న గ్రామాల్లో పని చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని పోలీసులు పట్టింపులేని తనంతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల గొర్రెకుంట కట్టమల్లన్న ఆలయం, కోటమైసమ్మ ఆలయాల్లో చోరీలు జరిగాయి. కొమ్మాల స్టేజీ వద్ద ఉన్న సాయి కిరాణా షాపులో సుమారు 14 తులాల బంగారం, రూ. 5 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. కొమ్మాల స్టేజీ వద్ద ఉన్న సీసీ కెమెరాలకు డీవీఆర్ (ఫొటో రికార్డింగ్ కోసం) ఏర్పాటు చేయలేదు. దీంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. నాలుగు నెలల క్రితం కొమ్మాల స్టేజీ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా డీవీఆర్ లేకపోవడంతో చేసేదేమీ లేక స్థానికుల సహకారంతో మృతుడి వివరాలను సేకరించారు. ఆ కేసులో పోలీసుల కంటే స్థానికులే ఎక్కవ శ్రమించాల్సి వచ్చింది. అప్పుడే పోలీసులు స్పందించి సీసీ కెమెరాలు పని చేసేలా డీవీఆర్ను ఏర్పాటు చేసి ఉంటే కిరాణా షాపులో చోరీ చేసిన దొంగలను సులభంగా పట్టుకునే అవకాశం ఉండేదని స్థానికులు అంటున్నారు.
ఇండస్ట్రీయల్ ఏరియాలో నిల్..
మండలంలోని ప్రగతి ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న మిల్లులు, గోదాముల్లో కోట్ల రూపాయల విలువ చేసే సరుకుల నిల్వలు ఉన్నాయి. అయినా యజమానులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రెండు నెలల క్రితం టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి గురుకులాల్లో చదివే విద్యార్థులకు అందించే దుస్తులు, బెడ్సీట్లు తదితర సుమారు రూ. 24 కోట్ల విలువ చేసే సామగ్రి దగ్ధమైంది. ఆ గోదాములో సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు ఉండి ఉంటే ప్రమాదం జరిగిన తీరు తెలిసి ఉండేదని స్థానికులు అంటున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను పోలీసులు వివరిస్తూ పారిశ్రామిక వాడతోపాటు అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే, ఇప్పటికే ఏర్పాటు చేసిన గ్రామాల్లో పని చేసేలా చర్యలు చేపట్టాలని విన్నవిస్తున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
నేడు బల్దియా గ్రీవెన్స్
మహా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నేడు గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో స్థానిక సమస్యలపై కమిషనర్ ప్రావీణ్య వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని విభాగాల వింగ్ అధికారులు, సంబంధింత అధికారులు సకాలంలో గ్రీవెన్స్కు హాజరు కావాలని సూచించారు.