రాయపర్తి, జూన్ 19: జాతీయ రహదారి గుంతలమయంగా మారి ప్రమాదాలకు నెలవుగా మారడంతో ప్రయాణికులు చలించిపోయారు. రూ. 60 వేలు వెచ్చించి బీటీ రోడ్డుకు రెడీమిక్స్ కాంక్రీట్తో మరమ్మతులు చేయించి శభాష్ అనిపించుకున్నారు. మైలారంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి మోకాల్లోతు గుంతలతో ప్రమాదాలకు నెలవుగా మారింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రి వేళల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వరంగల్కు చెందిన ఆర్యవైశ్య సంఘం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు మధుగుప్తా, భద్రకాళీ దేవస్థానం మాజీ డైరెక్టర్, వైశ్య సంఘం ప్రతినిధి తొడుపునూరి వీరన్న ఈ నెల 17న ఈ మార్గం గుండా వెళ్తూ మైలారంలో జాతీయ రహదారి దుస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే తమ వాహనాన్ని పక్కన నిలిపి రోడ్డుపై ఏర్పడిన గుంతలు, రోడ్డు తీరుతెన్నులను చూసి ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డుకు సంబంధించిన వివరాలను సర్పంచ్ లేతాకుల సుమతీ యాదవరెడ్డిని అడిగి తెలుసుకున్న వారు.. వెంటనే రూ. 25 వేలు వెచ్చింది టిప్పర్లో సీసీ తెప్పించి తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. ఆదివారం మరోమారు మైలారం గ్రామానికి చేరుకున్న వారు.. మరో రూ. 40 వేలు ఖర్చు చేసి రెడీమిక్స్ కాంక్రీట్ లోడ్లు తెప్పించి బీటీ రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల మరమ్మతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరించడంపై మధు, వీరన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో తమ సంఘం పరంగా స్వచ్ఛందంగా నిధులు ఖర్చు చేసి మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు అనంతుల రఘు, ఇరుపుల రమేశ్, నరేశ్ పాల్గొన్నారు.