నర్సంపేట రూరల్, జూన్ 19: పేదలకు ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కాకూడదని.. వారి పెళ్లిళ్లను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయి. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తుండడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో ఈ పథకాల కింద ఆడబిడ్డ పెళ్లికి రూ. 51 వేలు అందించగా.. ఆ తర్వాత రూ. 75,116లకు పెంచింది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆ మొత్తాన్ని రూ. 1,00,116కు పెంచి అందిస్తున్నారు.
పక్కాగా చెక్కుల పంపిణీ
నర్సంపేట నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఉన్నతాధికారులు, మండలస్థాయి రెవెన్యూ అధికారులు వెంట వెంటనే పరిశీలిస్తున్నారు. బడ్జెట్కు అనుగుణంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది బిల్లులు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే పెద్ది చేతులమీదుగా చెక్కులు అందజేస్తున్నారు. నిరుపేద యువతుల వివాహానికి ప్రభుత్వం అందిస్తున్న రూ. 1,00,116 ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతున్నదని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీతోపాటు మైనార్టీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పైరవీలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు ఈ పథకం ఫలాలను అందిస్తున్నారు.
ఒక్కో కుటుంబానిది ఒక్కో గాధ..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న ఒక్కో కుటుంబానిది ఒక్కో గాధ. తల్లిదండ్రులు ఉన్నా సెంటు భూమి లేని వారు కొందరు, తల్లిదండ్రుల్లో ఒక్కరు చనిపోగా మిగిలిన ఒక్కరే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నవారు మరి కొందరున్నారు. అంతేకాకుండా ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఆపై ఉన్న అమ్మాయిల పెళ్లిళ్లు చేయలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద దిక్కుగా నిలిచారని చెప్పకతప్పదు. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.
1,967 మందికి చెక్కుల పంపిణీ
నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాల లబ్ధిదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,967 మందికి రూ. 19,69,28,172 విలువైన చెక్కులను కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద అందించారు. వీరిలో నెక్కొండ మండలంలో 399 మంది, నర్సంపేటలో 499 మంది, నల్లబెల్లిలో 246 మంది, ఖానాపురంలో 230 మంది, దుగ్గొండిలో 324 మంది, చెన్నారావుపేట మండలంలో 269 మంది లబ్ధిదారులకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెక్కులు అందించారు.
2021-22లో 1548 మందికి..
లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అధికారులు పక్కాగా పంపిణీ చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలు 198 మందికి రూ. 1,98,22,968, ఎస్టీలు 349 మందికి రూ. 3,49,65,513, బీసీలు 880 మందికి రూ. 8,82,52,254, ఈబీసీలు 85 మందికి రూ. 85,09,860, షాదీముబారక్ 36 మందికి రూ. 36,04,176 విలువైన చెక్కులను అందించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఖర్చుల భారం కొంత వరకు తగ్గుతున్నది.
మా కుటుంబాన్ని ఆదుకున్నరు
కల్యాణలక్ష్మి పథకం ద్వారా నా కూతురు పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1,00,116 అందించి ఆదుకున్నరు. రాష్ట్ర సర్కారు అందించిన ఈ సహాయం ఎన్నటికీ మర్చిపోను. ఈ పథకంతో నిరుపేద కుటుంబాల్లో కొంత వరకు పెళ్లి ఖర్చులు తగ్గిస్తున్నది. భారీగా సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్ సారును జీవితాంతం గుర్తుంచుకుంటాం.
– పిట్టల రమాదేవి, ఇటుకాలపల్లి, లబ్ధిదారు
ప్రభుత్వ సాయం ఆసరాగా నిలిచింది
మాది భాంజీపేట గ్రామం. నాకు ఇద్దరు కుమార్తెలు. నా భర్త ఎలకంటి వీరమల్లు గతంలో అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల్ని కష్టపడుతూ సాదుకుంటూ వస్తున్నా. మాకు సెంటు భూమి లేదు. నేను దివ్యాంగురాలిని. గతేడాది సీఎం కేసీఆర్ దయ వల్ల పెద్ద బిడ్డ సుస్మిత పెళ్లి చేస్తే కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 75,116 అందించారు. ఈ సంవత్సరం చిన్న కూతురు అశ్మిత పెళ్లి చేయగా రూ. 1,00,116 అందించారు. కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఎలకంటి వరలక్ష్మి, భాంజీపేట, లబ్ధిదారు
సీఎంకు రుణపడి ఉంటాం
మాది రాజపల్లి గ్రామం. ఉండడానికి పూరి గుడిసె మాత్రమే ఉంది. సెంటు భూమి లేకపోయినా సీఎం కేసీఆర్ చేసిన సాయంతో ఆడబిడ్డ పెళ్లి చేసిన. నిరుపేద కుటుంబంలో కూతురు పెళ్లి ఎట్టా చేసేది అని ఆలోచిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో మా కుటుంబాన్ని ఆదుకోవడం జీవితంలో మర్చిపోలేను. పెండ్లికి ఆర్థిక సాయం అందించడం సంతోషంగా ఉంది. మా కుంటుంబం పక్షాన కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటా.
– ఎడ హైమ, ముగ్దుంపురం, లబ్ధిదారు