వరంగల్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అద్భుత చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు నెలవుగా ఉన్న వరంగల్ మహానగర సమీపంలో మరో కొత్త పర్యాటక కేంద్రం రూపుదిద్దుకోబోతున్నది. అందమైన ఎత్తయిన గుట్టలు, అటవీ, జల వనరులకు ఆలవాలంగా ఉన్న దేవునూరు ప్రాంతం టూరిజం స్పాట్గా మారనున్నది. ధర్మసాగర్-దేవనూరు మధ్య నాలుగు వేల ఎకరాల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ప్రణాళికలు రూపొందించింది. దశల వారీగా సకల వసతులు కల్పించి అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేలా ప్లాన్ సిద్ధం చేసింది. మొత్తం పూర్తయితే ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవునూరు ప్రాంతం సరికొత్తగా మారనుంది.
ప్రకృతి అందాల నెలవు..
వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న ఏకైక దట్టమైన అటవీ ప్రాంతం దేవునూరు. ఇది పూర్తిగా ఇనుపరాతి గుట్టలతో కూడి ఉన్నది. ధర్మసాగర్, వేలేరు, ఎలతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలోని 4,886 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతం కావడంతో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కుడా భావిస్తున్నది. దేవునూరు అటవీ ప్రాంతం అని నిజాం హయాంలోని రికార్డుల్లోనూ ఉంది. ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎంతో గొప్పగా ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గజేల జింకలు, మచ్చల జింకలు, గుడ్డెలుగులు, పునుగు పిల్లులు, అడవి పిల్లులు, ముళ్ల పందులు, అడవి పందులు, ముంగీసలు, కొండగొర్రెలు, కుందేళ్లు, ఉడుములు, కొండచిలువలు, నాగుపాములు, జెర్రిపోతులు, గద్ద జాతి పక్షులు, గుడ్లగూబలు, జిట్ట పిట్టలు, జీనువాయి పిట్టలు, కొంగలు వంటి 80 జాతుల జంతువులు, సరీసృపాలు, పక్షులు ఈ ప్రాంతంలో మనుగడ సాగిస్తున్నాయి.
25 రకాలకు పైగా సీతాకోక చిలుక జాతులు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. పూర్తిగా గుట్టలతోపాటు భారీగా జలాశయం ఉండడంతో సుదూర ప్రాంతం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. వేల పక్షులు ఈ జలవనరుల్లో ఉంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎకడా లేనన్ని ఔషధ మొకలు ఈ ప్రాంతంలో ఉన్నాయని అటవీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వనసేవ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో వనదర్శిని విజ్ఞానయాత్రలను, బర్డ్ వాక్, ఫారెస్ట్ వాక్ లాంటి అనేక పర్యావరణ కార్యక్రమాలను నిర్వహించారు. ట్రెకింగ్, నైట్ క్యాంపింగ్ వంటి ఉల్లాసవంతమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో మంది పర్యావరణ ప్రేమికులు, పరిశోధన విద్యార్థులు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు ఈ ప్రాంతాన్ని రోజూ సందర్శిస్తున్నారు.
రూ.50కోట్లతో అంచనాలు
ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపంలో పర్యాటకుల కోసం ప్రత్యేకంగా కాటేజీలు, రాత్రిబస కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడి నుంచి దేవునూరు గుట్టల వరకు ప్రత్యేకంగా రోప్ వే ఏర్పాటు చేయనున్నారు. అటవీ ప్రాంతంతో సంబంధం లేకుండానే నాలుగు కిలో మీటర్ల మేర రోప్ వే ఏర్పాటు చేసి పర్యాటకులు నేరుగా అక్కడికి వెళ్లేలా అభివృద్ధి చేయనున్నారు. చుట్టూ గుట్టలతో ఆహ్లాదకరంగా ఉండే రిజర్వాయర్ మధ్యలోని ఓ ప్రాంతంలోనూ బస చేసేందుకు కాటేజీలు నిర్మించనున్నారు. ధర్మసాగర్ చెరువు మీదుగా దేవునూరు ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి కోసం రూ.50 కోట్లు కావాలని ప్రాథమికంగా అంచనా వేశారు. తొలిదశలో రూ.5 కోట్లతో పనులు మొదలు పెట్టనున్నారు. దేవునూరు ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలిరానున్నారు.