వరంగల్, నవంబర్ 22(నమస్తేతెలంగాణ) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రే వంత్రెడ్డి రైతులను రెచ్చగొట్టేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డా రు. సిగ్గు, శరం ఉందా? అంటూ బండి సంజయ్, రేవంత్రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి వరంగల్ కలెక్టరేట్ వద్ద మీడియా తో మాట్లాడుతూ.. మోటర్లకు మీటర్లు అమర్చాలనేది కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లులో లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొనడం అతడి అవగాహన లేమికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఢిల్లీ పరిసరాల్లో ఏడాది నుంచి ఆందోళన చేస్తున్న రైతులు కూడా కేంద్రం రూపొందించిన విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. సాగు చట్టాలను రద్దు చేసినట్లు ప్రకటించిన ప్రధాని మోదీ రైతులను క్షమాపణ కోరితే బండి మాత్రం సిగ్గు లేకుండా రైతులను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడుతున్నాడన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో దేశవ్యాప్తంగా చనిపోయిన రైతులకు డబ్బులిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే తెలంగాణలో చనిపోయిన రైతుల సంగతేమిటని బండి సంజయ్, రేవంత్రెడ్డి పేర్కొనడాన్ని మంత్రి తప్పుపట్టారు.
దేశంలో మరే రాష్ట్రంలో, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేని విధంగా ఏ కారణంతోనైనా చనిపోయిన రైతు కుటుంబం ఆగం కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడమే కాకుండా ఆర్థికసాయం కూడా చేశామన్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అక్కడ రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనడం లేదన్నారు. దీంతో ఆ రైతులు ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రాంతంలోని సెంటర్లకు ధాన్యం తెచ్చి అమ్ముతున్నారని చెప్పారు. ఛత్తీస్గఢ్ నుంచి ఏటూరునాగారం ప్రాంతానికి ధాన్యంతో వచ్చిన చాలా లారీలను పట్టుకున్నామని, ఈ విషయం రేవంత్రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం వానకాలం వడ్లను కొనడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల కోట్ల నష్టం వస్తున్నదని, అయినా రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రతి గింజ కొనే పనిలో ఉన్నామని దయాకర్రావు చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న సీఎం కేసీఆర్ను దేశమంతా అభినందిస్తుంటే బండి సంజయ్, రేవంత్రెడ్డి పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కావాలని పనిగట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలను రైతులు నమ్మవద్దని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శిస్తే రైతులు ఊర్కోవద్దని అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.