గిర్మాజీపేట, జూన్ 10: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జిల్లాలో కొనసాగుతున్నట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. సర్కారు బడుల్లో నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు పూర్వ ప్రాథమిక విద్యలో 45, ఒకటో తరగతిలో 1161, రెండో తరగతిలో 781 మంది విద్యార్థులు చేరారన్నారు. మనఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రక్రియకు సంబంధించి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యాబోధన జరిగేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఊతమిచ్చేలా ప్రోత్సహిస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా వారిని అవగాహన కల్పించాలన్నారు. మనఊరు-మనబడి మొదటి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యుదీకరణ, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం, మరమ్మతులు, శిథిలావస్థలో ఉన్న వాటిలో నూతన గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్ల నిర్మాణం, వంట గదులు, ప్రహారీలు నిర్మించడం ద్వారా పూర్తిస్థాయిలో పాఠశాల అభివృద్ధి వైపు దృష్టి సారిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.
దశల వారీగా కార్యక్రమాలు
పాఠశాలలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం అవుతున్నాయని డీఈవో అన్నారు. బడిబాటలో భాగంగా 13 నుంచి ఈ నెల 30వ తేదీ వరకు దశల వారీగా అనేక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలను రూపొందించామన్నారు. 13న పాఠశాలల పునఃప్రారంభం, 14న ఆంగ్ల మాధ్యమంపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం, 15న ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం, 16న స్కూల్ మేనేజ్మెంట్ సమావేశం, 17న స్వయం సహాయక బృందాలతో సమావేశం, 18న బాలిక విద్య కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించడం, 20న సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం, 21న స్వచ్ఛ పక్షోత్సవాలు, 22న హరితహారం, 23న ప్రత్యుక అవసరాలుగల పిల్లల పేర్లు నమోదు, 24న బాలసభ ఏర్పాటు, అనంతరం చదువుల మేళా పేరుతో 25న గ్రంథాలయ దినోత్సవం ఆచరించడం, 27న బడిబయట ఉన్న విద్యార్థుల పేర్లు నమోదు కార్యక్రమం, 28న ద్విభాషా పుస్తకాలపై అవగాహన కార్యక్రమాలు, 29న డిజిటల్ విద్యపై అవగాహన కార్యక్రమం, 30న మ్యాథ్స్డేని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీఈవో వెల్లడించారు.
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
బడిబాట కార్యక్రమంలో భాగంగా చెన్నారావుపేటలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య, భోజనం, అనుభవం గల ఉపాధ్యాయులు ఉంటాయని తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంద్రసేనారెడ్డి, వీరభద్రయ్య, ఇన్చార్జి హెచ్ఎం రవి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఖానాపురం మండలంలోని రాగంపేట, మర్మాగిబోడుతండాలో హెచ్ఎంలు భిక్షపతి, గోవర్ధన్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ ప్రభుత్వ పాఠశాలల ఉపయోగంపై వివరించారు. శుక్రవారం 25 నూతన అడ్మిషన్లు చేసినట్లు హెచ్ఎంలు తెలిపారు. నల్లబెల్లి మండలంలోని బజ్జుతండా పరిధి చిన్నతండాలో సర్పంచ్ జాటోత్ పద్మా తిరుపతి బడిబాట ర్యాలీలో పాల్గొన్నారు. సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. రాయపర్తి మండలకేంద్ర పరిధిలోని కొత్తరాయపర్తి, ఎస్సీకాలనీలోని చిన్నారులను ప్రీస్కూల్ విద్యాభ్యాసం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్ అయిత కృష్ణవేణి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సేవలపై వివరించారు. కార్యక్రమంలో పూస రమ్య, దుబ్బెర రేణుక, బైరగోని కల్యాణి, బొమ్మెర స్వర్ణలత, పొగులకొండ శ్రీజ, రాజశేఖర్, ఇజ్జగిరి శ్రీనివాస్, అంగన్వాడీ ఆయా ఎం రజిత పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి
నర్సంపేటరూరల్: బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ముత్తోజిపేట సర్పంచ్ గోలి శ్రీనివాస్రెడ్డి, ఎంపీయూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు గోపాల్రావు కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బడిబాట ర్యాలీలు నిర్వహించారు. ముత్తోజిపేట ఎంపీయూపీఎస్లో ఏర్పాటు చేసిన బడిబాట ర్యాలీని సర్పంచ్ గోలి శ్రీనివాస్రెడ్డి, హెచ్ఎం గోపాల్రావు ప్రారంభించారు. ఉప సర్పంచ్ బుచ్చయ్య, ఉపాధ్యాయులు కొమ్మయ్య, రవీందర్, రవీంద్రాచారి, సరస్వతి, వార్డు సభ్యులు శ్రీను, రవి, శ్రీదేవి పాల్గొన్నారు.
ఎల్బీనగర్లో ర్యాలీ
పోచమ్మమైదాన్: వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆటో ద్వారా బడిబాట ర్యాలీ నిర్వహించారు. పాఠశాల వద్ద ఈ ర్యాలీని కార్పొరేటర్ ఎండీ పుర్ఖాన్ ప్రారంభించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎండీ అఫ్జల్ ఆటోకు బ్యానర్ కట్టి కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఎల్బీ నగర్, తిలక్రోడ్డు, లోతుకుంట, మోమిన్పుర, ఇస్లాంపుర, కాశీబుగ్గ, టెలికాం కాలనీలో తిరుగుతూ ఉపాధ్యాయులు ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుర్ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చేర్పించి, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ వైఎస్ చైర్మన్ తేజస్విని, హెచ్ఎం టీ కవిత, కార్పొరేషన్ ప్రతినిధి రబ్బాని, ఉపాధ్యాయులు అశోక్, అలీ, నవీన్కుమార్, రమేశ్, నీరజ, స్వప్న, లక్ష్మి, నాయకులు అనిల్కుమార్, బింగి మహేశ్, పలువురు ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పిల్లలు సర్కారు బడిలో చదవాలి
కాశీబుగ్గ: ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవం గల ఉపాధ్యాయులు ఉంటారని, పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని 18వ డివిజన్ కార్పొరేటర్ వస్కుల బాబు అన్నారు. డివిజన్లో బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రెయిన్మార్కెట్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం నర్సింహారావు, ప్రత్యేక అధికారి సంపత్రెడ్డి పాల్గొన్నారు.