వారం రోజులుగా ఊరూవాడన ఉద్యమంలా సాగుతున్న ‘ప్రగతి’ పనులతో పల్లె, పట్నం కొంగొత్తగా మారుతున్నది. పచ్చదనం, పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యమివ్వడం, గత విడుతల్లో మిగిలిన పనులు పూర్తిచేయడం, ప్రజల అవసరాలే లక్ష్యంగా అధికార గణం ముందుకుసాగుతుండడంతో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతున్నది. ఈమేరకు ఈ నెల 3న మొదలైన పల్లె, పట్టణ ప్రగతి విజయవంతం కోసం ప్రజాప్రతినిధులతో కలిసి రోజుకు కొన్ని పల్లెలు, వార్డులను చుట్టి వస్తూ వెనువెంటే పరిష్కారం చూపుతున్నది. జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ సైతం అటు ఏజెన్సీ ప్రాంతం ములుగు నుంచి ఇటు గ్రేటర్ వరంగల్ వరకు నిర్విరామంగా పర్యటిస్తూ వంద శాతం ‘ప్రగతి’ సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
నమస్తే నెట్వర్క్ : పల్లె, పట్టణ ప్రగతి పనుల్లో వేగం పెరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధుల వరుస పర్యటనలతో ఉమ్మడి జిల్లాలో ఏడో రోజూ ఉత్సాహంగా సాగింది. గురువారం జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్లి గ్రామాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. రూ.కోటి నిధులతో రామవరం-పలుగులతండాకు, రూ.2కోట్లతో రామవరం-తిరుమలగిరికి రహదారి పనులతో పాటు క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కొరిపెల్లిలో క్రీడా ప్రాంగణంతో పాటు డబుల్ బెడ్ రూములను ప్రారంభించారు. మానుకోట, తొర్రూరులో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన కార్యాలయ కమిషనర్ సత్యనారాయణ పర్యటించారు. కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు.
అలాగే జిల్లాకేంద్రంలో రూ.4.5కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. తొర్రూరు 14వ వార్డులో పనుల ప్రగతిని చూసి ప్రూనింగ్ ప్లాంటేషన్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ను సందర్శించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరలో రూ.4లక్షలతో క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించారు. అలాగే భూపాలపల్లి, జనగామ మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికులు పలు వార్డుల్లో మురికికాల్వల్లో సిల్ట్ తొలగించి, రోడ్లపై చెత్తాచెదారాన్ని తొలగించడంతో వీధులన్నీ కళకళలాడుతూ కనిపించాయి.