నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదో రోజు మంగళవారం పల్లె, పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా జరిగాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర పల్లె ప్రగతి కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని ప్రగతిని పరిశీలించారు. పల్లె ప్రగతిలో సర్పంచులదే కీలకపాత్ర అని పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. హనుమకొండలో పట్టణ ప్రగతిలో భాగంగా గ్రేటర్ 30వ డివిజన్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్తో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పర్యటించారు. ఆయాచోట్ల ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ధర్మసాగర్ మండలం కరుణాపురం, జానకీపురం, నారాయణగిరి గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్తో కలిసి పాల్గొన్నారు. శాయంపేట మండలం గట్లకానిపర్తి, నర్సింహులపల్లి, సూరంపేట గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలతో పాటు రోడ్లు, పారిశుధ్య పనులను జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పరిశీలించి, గతానికి ఇప్పుటికీ పల్లెల్లో వచ్చిన మార్పును గమనించాలని ప్రజలను కోరారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లిలో పల్లె ప్రగతి గ్రామసభలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట, కొత్తూరు, రంగాపురం గ్రామాల్లో నర్సరీ, డంపింగ్ యార్డు, ప్రకృతి వనం, వైకుంఠధామాలను కలెక్టర్ గోపి పరిశీలించి చెత్తను రీసైక్లింగ్ చేయాలని సూచించారు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో డంపింగ్యార్డు, శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించారు. భూపాలపల్లిలోని 24, 25 వార్డుల్లో కలెక్టర్ భవేశ్మిశ్రా కలియదిరిగి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఓపెన్ప్లాట్లు, డ్రైనేజీల్లో ఖాళీ కవర్లు, చెత్తాచెదారం మట్టి వేయొద్దని సూచాంచారు. రేగొండ మండలం కొండాపూర్, అప్పయ్యపల్లె, గాంధీనగర్లో పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.