వరంగల్, మే 23(నమస్తేతెలంగాణ): జిల్లాలో కంది పంట సాగు విస్తీర్ణం పెంచే దిశగా వ్యవసాయశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తనమేళా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందులో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం విడుదల చేసిన కంది విత్తనాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ప్రధానంగా కంది పంట సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే గతంలో జిల్లాలో రైతులు చాలా తక్కువ విస్తీర్ణంలో కంది పంట సాగు చేశారు. గత ఏడాది వానాకాలం కేవలం 2,192 ఎకరాల్లో మాత్రమే కంది సాగైనట్లు ఇటీవల ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించారు. పత్తి పంట 1,09,571 ఎకరాల్లో సాగు అయినందున దీని విస్తీర్ణం ఈ వానాకాలం 1.21 లక్షల ఎకరాలకు, కంది పంట సాగు విస్తీర్ణం సుమారు ఐదు వేల ఎకరాలకు పెంచేందుకు ప్రతిపాదించారు. కంది పంట సాగుతో లాభాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మంగళవారం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతుల కోసం విత్తనమేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈ కేంద్రం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి ప్రకటించారు. ఒక్కో ఎకరానికి అవసరమైన మూడు కిలోల వరంగల్ కంది-1(డబ్ల్యూఆర్జీఈ-97) విత్తనాలను రైతులు రూ. 390 చొప్పున ఇక్కడ కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు.
వరంగల్ కంది-1 ప్రత్యేకత
వరంగల్ కంది-1(డబ్ల్యూఆర్జీఈ-97)ను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రూపొందించి అభివృద్ధి చేసింది. దీన్ని 2019లో విడుదల చేసింది. మూడేళ్ల నుంచి ఏటేటా ఇక్కడ ఈ రకం కంది విత్తనాల ప్రొడక్షన్ పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా వరంగల్ కంది-1(డబ్ల్యూర్జీఈ-97) రకం విత్తనాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. దీని పంట కాలం 145 నుంచి 155 రోజులు. వానాకాలం జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఈ రకం కంది విత్తనాలను నాటవచ్చు. అధిక దిగుబడినిచ్చే మధ్య స్వల్పకాలిక రకమైనందున ఇది డిసెంబర్ నెలాఖరులో లేదా జనవరి మొదటి వారంలో కోతకు రానుంది. ఒక్కో ఎకరంలో 6 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కరెంటు, నీరు అందుబాటులో ఉన్నందున పత్తి పంటలో అంతరపంటగా వరంగల్ కంది-1 రకం సాగు చేయవచ్చు. విత్తే దూరం ఎర్రచెలక నేలలో వరసల మధ్య 4 అడుగులు, నల్ల రేగడి నేలలో వరసల మధ్య 5 నుంచి 6 అడుగులు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా వరంగల్ కంది-1 రకం కంది పంట ఫ్యుజేరియం ఎండు తెగులును తట్టుకుంటుంది. ఇది పత్తి పంటతో పాటే పూర్తి కానున్నందున జనవరిలో రైతులు దీని స్థానంలో వేసవి పంటగా వేరుశనగ, నువ్వులు, పెసర, మినుము తదితర పంటలను సాగు చేయవచ్చు. ఒక్కో ఎకరంలో నాటేందుకు వరంగల్ కంది-1 రకం కంది విత్తనాలు మూడు కిలోలు అవసరం. కందులకు ప్రభుత్వ మద్దతు ధర ఈ ఏడాది క్వింటాల్ రూ.6,300. దీంతో కంది పంట సాగు విస్తీర్ణం జిల్లాలో ఈసారి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అధిక దిగుబడినిచ్చే రకం ఇది
వరంగల్ కంది-1 రకం కంది విత్తనాలు అధిక దిగుబడినిస్తాయి. మధ్య స్వల్పకాలిక రకం ఇది. పత్తిలో అంతర పంటగా సాగు చేయడానికి అనుకూలం. తక్కువ కాల పరిమితి కలిగి ఉన్నందున పూత, కాత సమయంలో వచ్చే బెట్ట పరిస్థితులను తప్పించుకుంటుంది. ఎకరం విత్తనానికి 200 గ్రాముల రైజోబియంతో విత్తన శుద్ధి చేయాలి. 2 కిలోల ఫాస్పో బాక్టీరియాను 200 కిలోల మాగిన పశువువల ఎరువుతో కలిపి చివరి దుక్కిలో వేయాలి. పంటను బోదె సాళ్ల పద్ధతిలో విత్తుకోవాలి. పంట నీటి ఎద్దడికి గురైనప్పుడు రెండు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. బెట్ట పరిస్థితులు, మొగ్గ, కాయలు ఏర్పడే దశల్లో నీటి తడులు తప్పనిసరి.
– ఎన్ సంధ్యకిశోర్, శాస్త్రవేత్త, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం