వర్ధన్నపేట, మే 23: పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేస్తున్న కార్యకర్తల కుటుంబాలకు ప్రమాదబీమా అండగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రామవరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త కుల్లా కుమారస్వామి ఇటీవల ప్రమాదానికి గురై మృతి చెందా డు. అతడి పేరున పార్టీ తరఫున చేయించిన ప్రమాదబీమా కింద రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే సోమవారం రామవరం గ్రామంలోని కుమారస్వామి ఇంటికి వెళ్లి ఆయన భార్యకు చెక్కు అందజేశారు. అనంతరం అరూరి మాట్లాడుతూ టీఆర్ఎస్ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు ఏదైనా జరిగితే వారి కుటుంబాలు రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వారి పేరున ప్రమాద బీమా చేయించారని వివరించారు.
కార్యకర్త ప్ర మాదవశాత్తు మృతి చెందితే అతడి కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కు అందిస్తున్నట్లు వివరించారు. అలాగే, పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అరూరి తెలిపారు. ఎలాంటి కష్టం వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటూ ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్ఖన్నా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, సర్పంచ్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీ సోమయ్య, నాయకుడు నవీన్ పాల్గొన్నారు.