పరకాల, మే 23 : అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు మండలాలకు చెందిన 210మంది దివ్యాంగులకు ఉచిత పరికరాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదన్నారు. దేశంలో దివ్యాంగులకు అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్తో వృద్ధులు, దివ్యాంగుల జీవన స్థితిగతులు మెరుగయ్యాయన్నారు. త్వరలోనే 57 సంవత్సరాల వారికి పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ పీడీ సబిత, ఐసీడీఎస్ పరకాల సీడీపీవో భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, పరకాల ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీలు సిలివేరు మొగిలి, కోడెపాక సుమలత, మున్సిపల్ మిషనర్ తిరుణహరి శేషాంజన్ స్వామి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణ కేంద్రం సందర్శన..
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే కష్టపడి చదువుకోవాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని చల్లా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులతో మాట్లాడారు. ఉద్యోగ సాధనకు ప్రణాళిక ప్రకారం యువ త ముందుకు సాగాలన్నారు. పట్టణంలోని 18వ వార్డు రాజీపేటకు చెందిన గజ్జి రమ్య ఎంబీబీఎస్లో సీటు సాధించగా, ఆమెను అభినందించారు.