ధర్మసాగర్, మే 17 : దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితుల సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టారని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో మంగళవారం దళిత బంధు పథకం యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లు అందజేశారు. అనంతరం ఎంపీపీ నిమ్మ కవిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని దళితులను చైతన్యవంతులుగా చేసేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి, ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. లబ్ధిదారులు తమ భవిష్యత్ను తీర్చిదిద్దుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న మూడు సంవత్సరాల్లో నియోజకవర్గానికి చెందిన 2,000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, కొంచెం ఆలస్యమైనా అర్హులందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, లబ్ధిదారులు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఎమ్మెల్యే రాజయ్య కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, ఎంపీడీవో జీ జవహర్రెడ్డి, జడ్పీటీసీలు శ్రీలత, సరిత, వైస్ ఎంపీపీ రవీందర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న నృత్యం..
దళిత బంధు పథకం లబ్ధిదారులు ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు కోలాటం, డప్పు చప్పుళ్లతో ర్యాలీ తీశారు. లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే రాజయ్య నృత్యం చేశారు.
దళితులు గౌరవంగా బతుకుతారు..
నేను ఇప్పడు ట్రాక్టర్ ఓనర్ అయ్యాను. దళిత వాడలను అభివృద్ధి చేయాలనే సీఎం కేసీఆర్ ఆలోచన గొప్పది. దళితుల గురించి ఇది వరకు పట్టించుకునే వారు లేరు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఎన్నో ఏండ్లు పేదరికంలో మగ్గినం. సీఎం కేసీఆర్ దయతో ట్రాక్టర్కు ఓనర్నయ్యాను. దళితులు గౌరవంగా బతికేలా మంచి పథకం పెట్టారు. నేను దీని ద్వారా అభివృద్ధి సాధిస్తా.
– కలకోల మహేశ్, రాయగూడెం,
ధర్మసాగర్ మండలం
ట్రాక్టర్ రావడం నా అదృష్టం
ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం నా అదృష్టం. నాకు ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్ నడుపుకుంటూ నా కుటుంబాన్ని సాదుకుంటా. ఈ పథకం ద్వారా లబ్ధి పొందినందుకు మా కుటుంబం సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటుంది.
– కొయ్యడ బుచ్చయ్య, వేలేరు
దళితులకు మంచి రోజులు..
అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ దళితుల బతుకులను బాగుచేస్తుండు. ఆయన ఆయురారోగ్యాలతో మంచిగుండాలి. నిరుపేద దళితుల అభివృద్ధి కోసం ఇంకా పథకాలు తేవాలె. ఇది వరకు ఉన్న ప్రభుత్వాలు ముమ్ముల పట్టించుకోలె. మా వాడలను అభివృద్ధి చేయలె. సీఎం కేసీఆర్తో దళితులకు మంచి రోజులు వచ్చాయి.
-గాజుల సదానందం, ఎలుకుర్తి, ధర్మసాగర్ మండలం
చాలా సంతోషంగా ఉంది..
దళితబంధు పథకం నాకు వస్తదనుకోలేదు. ఎమ్మెల్యే రాజయ్య సహాయ సహకారంతోనే నాకు ఈ పథకంలో ట్రాక్టర్ వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటుంది.
– భైరపాక బాలస్వామి, ధర్మపురం, ధర్మసాగర్ మండలం
కారుకు ఓనరునయ్యా..
మాది నిరుపేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చి మాలాంటి పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపిండు. నేను కలలో కూడా కారుకు ఓనరైతననుకోలేదు. నాకు ఇప్పుడు జీవితంపై నమ్మకం కలిగింది.
– కందూకూరి ప్రసాద్, ముప్పారం, ధర్మసాగర్ మండలం