వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిపాలన కేంద్రం సరికొత్తగా మారుతున్నది. పారదర్శకంగా, వేగంగా పౌర సేవలు అందించేందుకు వీలుగా జీడబ్ల్యూఎంసీ పరిపాలన భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్నది. అత్యాధునిక హంగులతో, సాంకేతిక వసతులతో దీన్ని నిర్మిస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ కొత్త భవన నిర్మాణం కోసం మున్సిపల్ మంత్రి కేటీఆర్ గత నెలలో భూమి పూజ చేశారు. వీలైనంత త్వరగా భవన నిర్మాణం పూర్తయ్యేలా పనులు చేపట్టారు. పరిపాలన వ్యవహారాలు అన్ని ఒక్క చోట నుంచే సాగాలని, పౌరులకు ఇబ్బందులు ఉండకూడదని సీఎం కేసీఆర్ గతంలో వరంగల్ పర్యటకు వచ్చినప్పుడు చెప్పారు. జీడబ్ల్యూఎంసీకి కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణ అమల్లోకి వస్తున్నది. వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని విభాగాలు ఒకే భవనంలో ఉండేలా ప్రణాళికలు రూపొందించారు వరంగల్ మహానగరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని నిర్మిస్తున్నారు.
రూ.20.50 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఐదంతస్తుల్లో పరిపాలన భవనం నిర్మాణం కానుంది. అన్ని విభాగాల కార్యాలయాలు, మీటింగ్ హాల్స్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, కోర్టు యార్డులతోపాటు విశాలమైన పార్కింగ్ వసతి కొత్త భవనం ప్లానింగ్లో ఉంది. జీడబ్ల్యూఎంసీలోని అన్ని విభాగాల వింగ్ అధికారులకు ఒకే అంతస్తులో ఆఫీస్లను కేటాయించనున్నారు. జిల్లా అధికారుల సమీకృత కార్యాలయాల భవన సముదాయం తరహాలోనే జీడబ్ల్యూఎంసీ కొత్త భవనం నిర్మాణం వేగంగా పూర్తి కానుంది. పౌర సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జీడబ్ల్యూఎంసీ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో కొత్త భవనాన్ని తీర్చిదిద్దనున్నారు.
రెండో పెద్ద నగరం..
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్ ఉన్నది. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టడంతో వరంగల్ మహానగరం వేగంగా విస్తరిస్తున్నది. విలీన గ్రామాల్లోనూ రవాణా, తాగునీరు, ఇతర వసతులను కల్పిస్తున్నది. ప్రస్తుతం వరంగల్ మహానగరం జనాభా 10 లక్షలు ఉన్నది. వచ్చే 25 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా జీడబ్లూఎంసీలో వసతుల కల్పన జరుగుతున్నది. జీడబ్ల్యూఎంసీ సమగ్ర అభివృద్ధి కార్యాచరణ అమలులో కీలకమైన పరిపాలన భవనాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ మహానగరంలోని ప్రజలకు సేవలను అందించడంతోపాటు వారికి పటిష్టమైన భద్రత కల్పించేలా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నది.
150 సీట్ల కౌన్సిల్ హాల్..
వరంగల్ మహానగరానికి అనుగుణంగా 150 సీట్లతో కౌన్సిల్ హాల్ నిర్మాణం జరుగుతున్నది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్ను రూ.2 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుత కౌన్సిల్ హల్ చిన్నగా ఉండడంతో సమావేశాలు నిర్వహించేందుకు ఇబ్బందింగా ఉంటున్నది. చాలాసార్లు కౌన్సిల్ సమావేశాలు బయటి నిర్వహించే పరిస్థితి ఉన్నది. ఇలాంటి వాటిని నివారించేందుకు ప్రస్తుతం మేయర్ చాంబర్ భవనంపై కొత్త కౌన్సిల్ హాల్ను నిర్మిస్తున్నారు.