వర్ధన్నపేట, మే 10: హాని చేసే విపక్షాలను దరిచేరనీయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం వర్ధన్నపేట కోనారెడ్డి చెరువుకట్ట శాశ్వత మరమ్మతులు, అంబేద్కర్ సెంటర్ వద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణ పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో హరీశ్రావు ప్రసంగించారు. కోనారెడ్డి చెరువుపై గతంలో ఉన్న విజిలెన్స్ కేసును పరిష్కరించి కట్ట శాశ్వత మరమ్మతుల కోసం రూ.13.62 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం కోసం రూ.2కోట్లు మంజూరు చేశామని మంత్రి చెప్పారు. పనులను వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వర్ధన్నపేట సీహెచ్సీని 30 నుంచి 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎమ్మెల్యే కోరారని, మె రుగైన సేవల కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే మండలంలోని 38 సబ్సెంటర్ల భవనాల కోసం రూ.16 లక్షల చొప్పున మంజూరు చేయగా, సరిపోవడం లేదని చెబుతున్నందున ఒక్కో సెంటర్కు మరో రూ.4లక్షలు తక్షణమే మంజూరు చేస్తానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిందేమీలేదని, ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలని కేంద్రానికి లేఖలు కూడా రాశారని తెలిపారు. ఇలాంటి వారు పాదయాత్రలు, సభలు పెట్టి ప్రజలను ఓట్లు వేయాలని కోర డం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషిచేస్తున్న ఎమ్మెల్యే రమేశ్కు తన పూర్తి సహకారం ఉంటుందని, లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో మూడోసారి ఆయనను గెలిపించాలని మంత్రి కోరారు.
సీహెచ్సీలో సేవలెలా ఉన్నాయమ్మా..?
వర్ధన్నపేట సీహెచ్సీని మంత్రి హరీశ్రావు సందర్శించారు. ఆ స మయంలో అక్కడ సాధారణ ప్రసవమైన ఓ మహిళ వద్దకు వెళ్లి పసిబిడ్డను చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు కేసీఆర్ కిట్ అందించి దవాఖానలో అందుతు న్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతుకుముందు వర్ధన్నపేటకు వచ్చిన మంత్రులు హరీశ్రావు, దయాకర్రావుకు మహిళలు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు మంత్రి హరీశ్రావును గజమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే గిద్దె రాంనర్సయ్య కళాబృందం సభలో ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎల్లావుల లలితాయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావుతో పాటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
త్వరలో కొత్త పింఛన్లు : మంత్రి ఎర్రబెల్లి
కరోనా కారణంగా నిలిచిన కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అర్హులైన వారికి అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పనులు చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు కేసీఆర్ మాత్రమే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్లాంటి ముఖ్యమంత్రిని తన 40 ఏళ్ల రాజకీయంలో ఎన్నడూ చూడలేదన్నారు.