వరంగల్ చౌరస్తా, మే 10 : గడువులోగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం దవాఖాన భవన నమూనాలను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో మరింత వేగాన్ని పెంచాలని ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులకు సూచించారు. వైద్య, ఆరోగ్యరంగంలో దేశంలో మూడవ స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈమేరకు వరంగల్ నగరాన్ని హెల్త్హబ్గా మార్చేందుకు కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. సుమారు రూ.1100 కోట్ల వ్యయంతో 24 అంతస్తుల్లో అధునాతన సాంకేతికతో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందని మంత్రి అన్నారు. పూర్తిగా పర్యావరణహితంగా నిర్మించాలనే ఉద్దేశంతో రీప్లాంటేషన్ విధానం ద్వారా ఇక్కడి భారీ వృక్షాలను కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రీప్లాంటేషన్ ద్వారా తిరిగి నాటిన సుమారు వంద చెట్లను కాపాడుకోవడానికి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, జిల్లా కలెక్టర్ గోపి, టీఎస్ ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్రెడ్డి, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు.