వరంగల్, మే 6(నమస్తేతెలంగాణ) : పారిశ్రామిక రంగంలో వరంగల్ను పరుగులెత్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద 1,200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మిస్తున్నది. దేశంలోనే అతి పెద్ద వస్త్ర నగరిగా రూపుదిద్దుకోనున్న ఈ పార్కు నిర్మాణానికి 2017 అక్టోబర్ 22న ముఖ్యమంత్రి కేసీ ఆర్ శంకుస్థాపన చేశారు. పార్కులో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా అభివృద్ధి పనులు చేస్తున్నది. ఇప్పటికే రోడ్లు, కరంటు, వీధి దీపా లు, నీటి సరఫరా కోసం రూ.315 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అధికారులు 14కి.మీ టూ, ఫోర్లేన్ ఇంటర్నల్ రహదారులు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. నీటి వసతి కల్పించా రు. మెగా పార్కుకు మిషన్భగీరథ నీటిని సరఫరా చేసేందుకు తొలి విడుత రూ.12 కోట్లతో చేపట్టిన పను లు పురోగతిలో ఉన్నాయి.
పైపులైన్, ట్యాంకుల నిర్మా ణం యుద్ధప్రాతిపదికన జరుగుతున్నది. తాజాగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టు నుంచి మిషన్భగీరథ నీటిని మెగా పార్కుకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రెండో విడుత మరో రూ.100 కోట్లు కేటాయించింది. పనులు చేపట్టేందుకు మిషన్భగీరథ ఇంజినీరింగ్ విభాగం అధికారులు టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. సాధ్యమైనం త త్వరలో పనులు ప్రారంభించే దిశగా అడుగులు వే స్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం ఇప్పటికే పార్కులో ప్రభుత్వం 33/11కేవీ సబ్స్టేషన్ నిర్మించింది. వస్త్ర పరిశ్రమల స్థాపనకు పలు కంపెనీలు మందుకొస్తున్న దరిమిలా పార్కులో కొత్తగా 220కేవీ సబ్స్టేషన్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.158 కోట్లు మంజూరు చేసింది. విద్యుత్ సంస్థకు ఇటీవల రూ.10 కోట్లు డిపాజిట్ కూడా చేసింది. విద్యుత్ సంస్థ అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు.
గణేశా ఇకో పెట్ రెడీ..
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పేందుకు దేశ విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొదట నార్త్ ఇండియాకు చెందిన గణేశా ఇకో స్పేర్ కంపెనీకి యాభై ఎకరాలు కేటాయించింది. దీంతో సదరు కంపెనీ 30 ఎకరాల్లో ఫైబర్ యాన్ లైన్ ప్రొడక్షన్ కోసం ఇకో పెట్ ప్లాంట్, 20 ఎకరాల్లో వాషింగ్ లైన్ ప్రొడక్షన్కు గణేశా ఇకో టెక్ ప్లాంట్ నిర్మించింది. విదేశాల నుంచి అధునాతన యంత్రాలను దిగుమతి చేసుకుని ప్లాంట్లలో అమర్చింది. ప్రస్తుతం గణేశా ఇకో పెట్ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఉత్పత్తి కోసం అవసరమైన ప్లాస్టిక్ వస్తువులను ఇప్పటికే పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుని ప్లాంట్ల వద్ద నిల్వ చేసింది. అలాగే, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పలు కంపెనీలు ఈ పార్కులో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. కేరళ రాష్ర్టానికి చెందిన కైటెక్స్ కంపెనీకి ఇక్కడ 187 ఎకరాలు కేటాయించగా సదరు సంస్థ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది.
కంపెనీ ప్రతినిధులు లెవలింగ్ పనులు చేస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్ పొంది వస్త్ర పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించే ఏర్పాట్లలో ఉన్నారు. సౌత్ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీకి ప్రభుత్వం 263 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. వస్త్ర పరిశ్రమల స్థాపనకు ప్రాజెక్టు డిజైన్ రూపొందించింది. త్వరలోనే పరిశ్రమల నిర్మాణ పనులు మొదలుపెట్టే ఏర్పాట్లలో ఉంది. కైటెక్స్ నెలకొల్పే పరిశ్రమల్లో 12 వేల మందికి, యంగ్వన్ కంపెనీ స్థాపించే పరిశ్రమల్లో 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగనుంది. మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన ఎంఎస్ఎంఈకి ప్రభుత్వం ఇటీవల 52 ఎకరాలు కేటాయించింది. ఎంఎస్ఎంఈ ఇక్కడ 182 యూనిట్లను నెలకొల్పనుంది. ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.2 కోట్లు. ప్రతి యూనిట్లో ప్రత్యక్షంగా 12 మందికి ఉపాధి లభించనుంది.
నేడు పార్కుకు మంత్రి కేటీఆర్..
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు రానున్నారు. ఇప్పటికే ఉత్పత్తికి సిద్ధమైన గణేశా ఇకో స్పేర్ కంపెనీ వస్త్ర పరిశ్రమలను ప్రారంభిస్తారు. కైటెక్స్ కంపెనీ 187 ఎకరాల్లో నెలకొల్పే వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు. యంగ్వన్ కంపెనీకి కేటాయించిన 263 ఎకరాలను వ్యూపాయింట్ ద్వారా పరిశీలిస్తారు. ఎంఎస్ఎంఈకి ఇక్కడ కేటాయించిన 52 ఎకరాలకు సంబంధించిన పత్రాలను అందజేస్తారు. పార్కులో చేపట్టిన మౌలిక వసతుల పనులపైనా ఆయన అధికారులు, వస్త్ర పరిశ్రమల కంపెనీల ప్రతినిధులతో సమావేశమై సమీక్ష జరుపుతారు. ఈ సందర్భంగా పార్కులో జరిగే సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కేటీఆర్ మెగా పర్యటనలో పాల్గొంటారు.
మంత్రి పర్యటన షెడ్యూల్..
ఖిలావరంగల్ : జిల్లాలో శనివారం మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో కలిసి కేటీఆర్ ఉదయం 10 గంటలకు శాయంపేట హవేలీలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు చేరుకుంటారు. అక్కడ కైటెక్స్ టెక్స్టైల్ పార్కుకు భూమి పూజ, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన, గణేశా ఏకోపెట్ టెక్స్టైల్ పరిశ్రమల ప్రారంభోత్సవం చేస్తారు. 10:30 గంటలకు పార్టీ సమావేశంలో పాల్గొనున్నారు. 11:30 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా శాయంపేట హవేలీ నుంచి బయలు దేరి మామునూరు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 12 గంటల వరకు అక్కడే ఉంటారు.
హెలీప్యాడ్ను పరిశీలించిన సీపీ
గీసుగొండ : టెక్స్టైల్ పార్కులో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ ఏర్పాటు పనులను వరంగల్ సీపీ తరుణ్జోషి శుక్రవారం పరిశీలించారు. రూట్ మ్యాప్తో పాటు పలు ప్రదేశాలను పరిశీలించి పోలీసులు సూచనలు చేశారు. హెలీప్యాడ్ చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. పార్కులో అడుగడుగునా పోలీసుల నిఘా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ నరేశ్కుమార్, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.