వరంగల్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గత పాలకుల పక్షపాత వైఖరి కారణంగా తెలంగాణ ఘన చరిత్ర మసకబారింది.. ఇక్కడి అద్భుత చారిత్రక కట్టడాలు వెలుగులోకి రాకుండా పోయాయి. దీనికితోడు స్థానికుల నిర్లక్ష్యం.. అవగాహన లేమితో ఎన్నో పురాతన నిర్మాణాలు కాలగర్భంలో కలిశాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు సంకల్పంలో ‘టీమ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్)’ భాగం పంచుకుంటున్నది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, వారసత్వ సంపద, కళలను పరిరక్షించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. అంతరించిపోయే దశలో ఉన్న చారిత్రక కట్టడాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు కార్యాచరణ చేపడుతున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి, పురాతత్వశాఖకు మధ్య వారధిగా పనిచేస్తున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో పలు ప్రాజెక్టులు కూడా చేసింది.
కాకతీయుల వారసులపై డాక్యుమెంటరీ
ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న కాకతీయుల వారసులపై ఏండ్లపాటు పరిశోధన చేసిన టార్చ్ బృందం ప్రత్యేకంగా డాక్యుమెంటరీ రూపొందించింది. రామప్ప ఆలయానికి యునెసో గుర్తింపు దక్కిన సందర్భంగా ఆ కట్టడం చారిత్రిక, సాంస్కృతిక విశేషాలను నలుదిశలా చాటేందుకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ‘ఏ సింఫనీ ఇన్ స్టోన్’ పేరిట గత అక్టోబరులో 100 రోజులపాటు ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించింది. తెలంగాణలోని కాకతీయుల ఆలయాలు, చారిత్రక కట్టడాలు, కోటలు, మెట్ల బావులు, శాసనాలు, శిల్పాలపై దసరా సందర్భంగా బస్తర్లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. రెండు లక్షల మందికి పైగా ఈ ఎగ్జిబిషన్కు వచ్చారు. కాకతీయుల యుద్ధ నాట్యం పేరిణి ప్రదర్శనను టార్చ్ ఆధ్వర్యంలో బస్తర్లోని కాకతీయుల వారసుడు మహారాజా కమల్చంద్ర భంజ్దేవ్ కోటలో ఏర్పాటు చేయించారు.
ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ, ముఖ్యమంత్రి భూపేష్ భగల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక-సారలమ్మ జాతరకు విశ్వవ్యాప్త గుర్తింపు తేవాలనే ఆలోచనతో టార్చ్ బృందం ప్రత్యేకంగా డాక్యుమెంటరీ రూపొందించింది. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో టార్చ్ బృందం చేసిన పరిశోధనల్లో లభించిన వ్యాసాలు, పుస్తకాలు, శాసనాలు, ఫొటోలు, పెయింటింగ్లు, కళాఖండాల సమాచారాన్ని ఆధునిక టెక్నాలజీతో డిజిటలైజ్ చేస్తున్నది. ఈ సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, పరిశోధకులు, పురాతత్వ ఔత్సాహికులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నది.
పరిశోధించి.. నివేదించి..
చరిత్ర పరిశోధకుల బృందంతో ఏర్పాటైన టార్చ్, స్వచ్ఛందంగా పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశోధన ద్వారా వెలికితీసిన అంశాలను అందరికీ తెలియజేస్తున్నది. క్షుణ్ణంగా అన్వేషించి సేకరించిన తెలంగాణ అస్థిత్వపు సమాచారాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నది. శిథిలావస్థలో ఉన్న పురాతన కట్టడాలు, స్తూపాలు, సమాధులు, తోరణాలు, మెట్లబావులు, రాక్ ఆర్ట్స్, స్మారక చిహ్నాలు తదితర వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నది. వీటి విశేషాలను సంబంధిత అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులకు నివేదిస్తున్నది.
కాకతీయ సామ్రాజ్యంపై ప్రత్యేక దృష్టి
ఓరుగల్లు కేంద్రంగా ప్రజారంజక పరిపాలన సాగించిన కాకతీయ సామ్రాజ్యంపై టార్చ్ ప్రధానంగా దృష్టి పెట్టింది. తవ్వేకొద్దీ వచ్చే నీటి ఊటలా ఉండే కాకతీయుల చారిత్రక ఆనవాళ్లను విస్తృతంగా వెలికితీస్తున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో పోలిస్తే కాకతీయులకు సంబంధించి తెలియని చరిత్రే ఎక్కువ ఉన్నది. ఈ మేరకు అన్వేషణ కొనసాగిస్తున్న టార్చ్ బృందం, తమ పరిశోధనలో వెలుగులోకొచ్చిన సమాచారాన్ని డాక్యుమెంట్ రూపంలో భద్రపరిచి ముందుతరాలకు అందిస్తున్నది.
శాశ్వత వేదికగా టార్చ్
ప్రభుత్వంతోపాటు జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలు, ఎన్జీవోల భాగస్వామ్యంతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు టార్చ్ను శాశ్వత వేదికగా ఏర్పాటు చేశాం.. చారిత్రక సంపదపై అందరికీ అవగాహన కల్పించేందుకు హెరిటేజ్ వాక్, సెమినార్లు, ప్రచురణలు, వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. యువ పరిశోధకులు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. టార్చ్కు కాకతీయుల వారసుడు మహారాజా కమల్చంద్ర భంజ్దేవ్ గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
– అరవింద్ ఆర్య, ప్రధాన కార్యదర్శి, టార్చ్