ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు
సీఎం సాహసోపేత నిర్ణయాలతో ప్రజలకు భరోసా
వ్యాక్సిన్ కొరత తీర్చేందుకే గ్లోబల్ టెండర్లు
ఆక్సిజన్, మందుల కొరత లేదు
ప్రధానికి గుజరాత్ తప్ప ఏ రాష్ట్రం కనిపించడంలేదు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ప్రైవేట్ హాస్పిటళ్ల అధిక ఫీజుల వసూలుపై మంత్రి సీరియస్
హన్మకొండ, మే 20: తెలంగాణ రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం (ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్)లో కలెక్టర్లు, వైద్యాధికారులు, టాస్క్ఫోర్స్ కమిటీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేయడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అం దులో భాగంగానే ఆరు మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉప కేంద్రాలు, 40 ప్ర భుత్వ వైద్యశాలల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. సీఎం తీసుకుంటున్న సాహసోసేత నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలకు భరోసా కలుగుతున్నదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, మందుల కొరత లేదన్నారు.
కొవిడ్ బాధితులు ప్రభుత్వ దవాఖానల్లోనే చికిత్స పొందాలని మంత్రి కోరారు. ప్రైవేట్ వైద్యశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులకు గురికావొద్దని సూచించారు. వరంగల్ ఎంజీఎం వైద్యశాలలో ఆక్సిజన్, మందుల కొరత లేదని తెలిపారు. మరో 275 ఆక్సిజన్ ఫ్లో మీటర్లు సమకూర్చామన్నారు. సీఎం చొరవతో ఎంజీఎం ఉద్యోగులు, సిబ్బందికి అన్ని వసతులు కల్పించనున్నామన్నారు. అలాగే దవాఖాన రూపు రేఖలు మార్చాలని సీఎం కేసీఆర్ ధృడ నిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ లక్షణాలు కనిపిస్తే ఏఎన్ఎం, ఆశ వర్కర్ల వద్ద ఉన్న కిట్లతో టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అన్ని రకాల మందులతో కూడిన కిట్లు వారి వద్ద ఉన్నట్లు మంత్రి తెలిపారు.
ప్రజారోగ్యం బేష్
కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బాగుందని మం త్రి ఎర్రబెల్లి తెలిపారు. రాష్ర్టానికి అవసరమయ్యే వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం సరిగా ఇవ్వడంలేదని చెప్పారు. ప్రధాని మోదీకి గుజరాత్ తప్ప ఏ రాష్ట్రం కనిపించడంలేదన్నారు. గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను సేకరిస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ దవాఖానలను స్వయంగా పరిశీలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే బుధవారం సికింద్రాబాద్ గాంధీ ద వాఖానను ఎలాంటి పీపీఈ కిట్ వేసుకోకుండా సందర్శించినట్లు చె ప్పారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, భోజనం, తదితర వివరాలు తెలుసుకొని, మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆ దేశించినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా కరోనా బాధితుల్లో ధైర్యాన్ని నింపారని చెప్పారు. ఈ సమావేశంలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, ఎం హరిత, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వీ చంద్రశేఖర్, నోడల్ అధికారి శ్రీనివాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ లలితాదేవి, టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.