కోణార్క్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఇద్దరు రైల్వే కార్మికుల మృతి
ట్రాక్కు పెయింట్ వేస్తుండగా ఘటన
రెండు కుటుంబాల్లో విషాదం
మహబూబాబాద్, మే 7 : రోజూ చేసే పనే వారికి యమపాశమైంది. పట్టాలకు పెయింట్ వేస్తున్న ఇద్దరిని రైలు పొట్టనబెట్టుకుంది. కోణార్క్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఇద్దరు రైల్వే పెయింటర్స్(కలాసి) మృతిచెందారు. ఈ ఘటన మహబూబాబాద్-తాళ్లపూసపల్లి రైల్వేట్రాక్ మధ్యలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. జీఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉంటు న్న ఎండీ యాకూబ్పాషా(40), రెడ్యాల గ్రామానికి చెందిన ఏంపెల్లి కమలాకరాచారి(30) రైల్వే కలాసీలు(పెయింటర్స్)గా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్ సమీపంలోని మహబూబాబాద్-తాళ్లపూసపల్లి రైల్వేట్రాక్-2 అప్లైన్లో పెయింట్ వేస్తున్నారు. కాగా, లోకో పైలట్ రైల్వేట్రాక్-1పై గూడ్స్ వస్తుందని పాషా, కమలాకర్కు సమాచారం అందించారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ అప్లైన్లో వస్తోంది. ట్రైన్ కూత వేసినప్పటికీ ట్రాక్-1పై వచ్చే గూడ్స్దే కావొచ్చునని వారిద్దరూ పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన కోణార్క్ రైలు ఆ ఇద్దరు కూలీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో పాషా, కమలాకర్ మృతదేహాలు ముక్కలయ్యాయి. విషయం తెలుసుకున్న జీఆర్పీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను జిల్లా దవాఖాన మార్చురీకి తరలించారు.
బాధిత కుటుంబాల్లో విషాదం
రెడ్యాల గ్రామానికి చెందిన ఏంపెల్లి కమలాకరాచారికి సింధుతో ఏడాది క్రితమే వివాహమైంది. రైల్వేలో ఉద్యోగం రావడంతో జీవితమంతా ఆనందంగా భరోసాతో గడుపుదామనుకున్నారు. కానీ, శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం కమలాకర్ను తిరిగిరాని లోకాల కు తీసుకెళ్లి సింధుకు తీరని శోకాన్ని మిగిల్చింది. కమలాకర్ మృతి చెందడంతో రెడ్యాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, యాకూబ్పాషాకు భార్య అప్సర్, తొమ్మిదేళ్ల కూతురు సనా ఉన్నా రు. ప్రస్తుతం అతడి భార్య ఆరు నెలల గర్భిణి. జిల్లా దవాఖానలో రెండు కుటుంబాల రోదనలు మిన్నంటాయి. చూసిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి.